బీరు పరిశ్రమపైనా ‘యుద్ధ’ భారం
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:07 AM
గల్ఫ్ యుద్ధంతో పెరిగిపోయిన ముడి పదార్ధాల ఖర్చులు, ధరలపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ బీరు పరిశ్రమ పాలిట శాపంగా మారాయని కింగ్ఫిషర్ బ్రాండ్ పేరుతో బీరు విక్రయించే యునైటెడ్ బ్రూవరీస్...
‘ఎక్సైజ్’ భారమే పెద్ద గుదిబండ
తెలంగాణలో అత్యధిక పన్ను
యునైటెడ్ బ్రూవరీస్ సీఈఓ వివేక్
బెంగళూరు: గల్ఫ్ యుద్ధంతో పెరిగిపోయిన ముడి పదార్ధాల ఖర్చులు, ధరలపై రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ బీరు పరిశ్రమ పాలిట శాపంగా మారాయని కింగ్ఫిషర్ బ్రాండ్ పేరుతో బీరు విక్రయించే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) సీఈఓ, ఎండీ వివేక్ గుప్తా తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోకపోతే పరిశ్రమ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. పెరిగిన ఖర్చుల భారం తట్టుకునేందుకు ధరలు పెంచాలన్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించక పోవడంతో కుంగిపోతున్నట్టు చెప్పారు. గల్ఫ్ యుద్ధ ప్రభావం బీరు పరిశ్రమపై ఉన్నంతగా మరే పరిశ్రమపైనా లేదన్నారు. సీసాలు, ముడి పదార్ధాల ధరలు పెరిగిపోవడంతో పాటు మంచి లాభాలు ఉండే ఎగుమతులూ ఈ యుద్ధంతో నీరసించినట్టు గుప్తా తెలిపారు. బీరు అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే భారీ ఎక్సైజ్ సుంకమే పెద్దభారంగా మారిందని గుప్తా చెప్పారు. ‘యూబీఎల్.. తెలంగాణలో ఒక కేసు బీరు బాటిల్స్ అమ్మితే మాకు దక్కేది రూ.330 మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎక్సైజ్ సుంకం రూపంలో దాదాపు రూ.1,400 వరకు వస్తోంది’ అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ బీరుపై ఇంత భారీ స్థాయిలో ఎక్సైజ్ సుంకం లేదన్నారు. బీరు కంపెనీల వ్యాపారంలో 75 శాతంపై ప్రభుత్వ నియంత్రణ ఉన్న విషయాన్ని గుప్తా గుర్తు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్గా మారిన ఆడియో