41 రోజుల్లో 70 చోరీలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:24 AM
అయోధ్యలో కానుకల చోరీ గుట్టు విప్పుదామన్నా.. ఆధారాల్లేకుండా అక్రమార్కులు ఎంతో తెలివిగా వ్యవహరించారు. కనీసం 180 రోజులకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ రికార్డులను...
అయోధ్య రామాలయంలో అడుగడుగునా ఉల్లంఘనలే..
సీసీటీవీ కెమేరాలున్నా.. కళ్లు తెరిచి చూడలేని నిర్లక్ష్యం
ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రూ.113 కోట్ల ఖర్చు
రికార్డులను పరిశీలిస్తున్న సిట్.. ముగ్గురికి రిమాండ్
నాపై ప్రతి ఆరోపణకు బదులిస్తా: చంపత్రాయ్
విరాళాలన్నీ భద్రంగానే ఉన్నాయి: ట్రెజరర్ గోవింద్దేవ్
ఆరోపణలకు బదులిస్తా:చంపత్రాయ్
వస్తు కానుకలన్నీ భద్రం: ఆలయ ట్రెజరర్
న్యూఢిల్లీ, జూలై 7: అయోధ్యలో కానుకల చోరీ గుట్టు విప్పుదామన్నా.. ఆధారాల్లేకుండా అక్రమార్కులు ఎంతో తెలివిగా వ్యవహరించారు. కనీసం 180 రోజులకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ రికార్డులను భద్రపరచాలన్న ఆడిట్ కమిటీ సిఫారసులను తుంగలో తొక్కుతూ.. 45 రోజులకు సంబంధించిన ఆధారాలే ఉంచుతున్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 6 మధ్య కాలంలో, 41 రోజుల్లో మొత్తం 70 చోరీలు జరిగినట్టు రికార్డులను పరిశీలించినప్పుడు తెలిసింది. ఏప్రిల్ 27కు ముందు కూడా చోరీలు జరిగే ఉంటాయని అనుమానిస్తున్నప్పటికీ, నిరూపించేందుకు ఆధారాల్లేవు. ఇక, 2024 జనవరి 24న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, బలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఆలయ ట్రస్ట్ భారీగా రూ.113 కోట్లు ఖర్చు చేయడం వెనుక ఏమైనా అక్రమాలు చోటుచేసుకున్నాయా? అన్న అంశంపైనా సిట్ దృష్టి సారించింది. ఇక, విరాళాల చోరీ నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా కొట్టేసిన రాముడి సొమ్ముతో ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్ను కానుకగా ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు, రూ.2.5 లక్షలను ఆమె ఖాతాకు బదిలీ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. రూ.6 లక్షలతో తన సోదరుడి పెళ్లి ఘనంగా జరిపించగా, మరో సోదరుడికి రూ.5-6 లక్షల నగదు సాయం కూడా చేశాడు. ఈ కేసులో నిందితులు అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, కరునేష్ పాండేను పోలీస్ రిమాండ్కు అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశించింది. పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయడం తెలిసిందే.
విరాళాలన్నీ భద్రమే: ట్రస్ట్ ట్రెజరర్
రాముడికి భక్తులు సమర్పించిన 2,926 వస్తువులు భద్రంగానే ఉన్నాయని, వాటి రికార్డులను కూడా నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్దేవ్ గిరి ప్రకటించారు. ప్రస్తుతం 30కిలోల బంగారం, 1,518 కిలోల వెండి వస్తువులు ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. వీటికి సంబంధించి ఏటా ఆడిటింగ్ కూడా చేయిస్తున్నట్టు చెప్పారు. కాగా, రామాలయం విరాళాల చోరీ కేసులో సిట్ తుది నివేదిక సమర్పించిన అనంతరం..తనపై వచ్చిన ప్రతి ఆరోపణపైనా నోరు విప్పుతానని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి ఇటీవలే రాజీనామ చేసిన చంపత్రాయ్ మంగళవారం ప్రకటించారు. విచారణ దశలో మాట్లాడడం సరికాదనే, తాను మౌనం దాల్చినట్టు రాముడి భక్తులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్