అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:21 PM
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ నేపథ్యంలో దేవాలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్టు బోర్డు తాజాగా ఆమోదించింది.
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్టు బోర్డు ఆమోదించింది. చంపత్ రాయ్ స్థానంలో బజ్రంగ్ బాగ్రా ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాగ్రా విశ్వహిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఆయన గతంలో ప్రభుత్వ రంగ సంస్థ నాల్కోకు కూడా నేతృత్వం వహించారు.
ఆర్థిక రంగం, పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవం ట్రస్టు నిర్వహణకు విశేషంగా ఉపయోగపడుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పరిపాలన, ఆర్థిక అంశాలపై మంచి పట్టున్న వారిని రంగంలోకి దింపే ప్రయత్నంలో బాగ్రాకు ఈ బాధ్యతలు దక్కినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చంపత్ రాయ్ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ట్రస్టీగా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, జనరల్ సెక్రటరీగా బాగ్రా పేరును ప్రకటించేందుకు కొంత సమయం పడుతుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జులై 19-20 తేదీల్లో జరగనున్న వీహెచ్పీ ద్వైవార్షిక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
విరాళాల చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చంపత్ రాయ్తో పాటు అనిల్ మిశ్రా అనే ట్రస్టీ కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు తమ రాజీనామాలు సమర్పించారు. ఈ కేసుపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిట్ తన ప్రాథమిక నివేదికను సమర్పించింది. విరాళాలను లెక్కించే సిబ్బంది నిధులను ఎలా దారి మళ్లించారనే విషయాలను తన నివేదికలో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు..
మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు..