రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి పేరు ముందు గౌరవ సూచకం ఉండాల్సిందే
ABN , Publish Date - May 07 , 2026 | 07:38 AM
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి పేర్లు రాసేటప్పుడు కచ్చితంగా గౌరవ సూచకాలతో సంబోధించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. వారి పేర్ల ముందు ‘శ్రీ, గౌరవనీయులు, మిస్టర్’ వంటి...
మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు శ్రీ ఉండాలి
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు
లక్నో, మే 6: రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి పేర్లు రాసేటప్పుడు కచ్చితంగా గౌరవ సూచకాలతో సంబోధించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. వారి పేర్ల ముందు ‘శ్రీ, గౌరవనీయులు, మిస్టర్’ వంటి పదాలను తప్పనిసరిగా వాడాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఉత్తరప్రదేశ్లో దాఖలైన ఒక ఎఫ్ఐఆర్లో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పేరుకు ముందు గౌరవ సూచకాన్ని వాడలేదని దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరున్ సక్సేనాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, విధాన పరిషత్ల చైర్మన్లు, పార్లమెంటు, అసెంబ్లీల సభ్యుల పేర్లు రాసేటప్పుడు ఈ గౌరవ సూచకాలను తప్పక వాడాలని ఆదేశించింది. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే పదవుల్లో ఉన్నవారందరి పేర్ల ముందు గౌరవ సూచకాలను వాడాలని పేర్కొంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని తప్పక గౌరవించాల్సిందేనని స్పష్టంచేసింది. అయితే, పౌర సేవల్లో ఉన్న ఉద్యోగులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. వారి పేర్లకు ముందు ఈ గౌరవ సూచకాలు తప్పనిసరి కాదు.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్కు గవర్నర్ అనుమతి నిరాకరణ