పౌరసత్వ దరఖాస్తు ఫీజులను పెంచనున్న యూఎస్! ఏకంగా 75 శాతం..
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:27 PM
పౌరసత్వ దరఖాస్తు ఫీజును పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను విడుదల చేసింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: పౌరసత్వ దరఖాస్తు ఫీజు పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ తాజాగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. తాజా ప్రతిపాదనల ప్రకారం, పౌరసత్వ దరఖాస్తు (ఎన్-400 ) ఫీజును 760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు పెంచాలని పేర్కొంది. ఈ దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పుడు చేసుకునే అప్పీలు ఫీజును కూడా 830 డాలర్ల నుంచి 1,475 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది.
ఫీజు పెంపులతో పాటు గతంలో అర్హులైన కొందరు దరఖాస్తుదారులకు ఇచ్చిన ఫీజు తగ్గింపు, మినహాయింపు వసతులను కూడా తొలగించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయించంది. ఫెడరల్ మార్గదర్శకాలకు సంబంధించి గతంలో తక్కుక ఆదాయం ఉన్న వారు పౌరసత్వం, అప్పీలుకు సిద్ధమైనప్పుడు ఫీజులో కొంత రాయతీ ఇచ్చే వారు. కొందరికి ఫీజును పూర్తిగా రద్దు చేసేవారు. వీటన్నిటినీ తొలగించాలని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ శాఖ ప్రతిపాదించింది. దీంతో ఇకపై దాదాపు ప్రతిఒక్కరూ పౌరసత్వ దరఖాస్తుల సమయంలో పూర్తి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు పరిశీలన ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఫీజులు కూడా పెంచేందుకు సిద్ధమయ్యామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అదనపు ఫీజులతో సమకూరే నిధులతో మరింత సమర్థవంతంగా దరఖాస్తు పరిశీలన చేపట్టవచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు ఫెడరల్ ప్రభుత్వం 60 రోజుల గడువు ఇచ్చింది. ఫీజు పెంపుపై తుది నిర్ణయం తీసుకునే వరకూ ప్రస్తుత ఫీజులు అమల్లో ఉంటాయని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం వివిధ రకాల వీసా ఫీజులను పెంచిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
పాకిస్థాన్, ఖతార్లపై విరుచుకుపడిన అమెరికా సెనేటర్లు..
ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డొనాల్డ్ ట్రంప్