యూఎస్ ఆర్మీ హెలికాఫ్టర్ను కూల్చేసిన ఇరాన్.. అమెరికా ప్రతీకార దాడులు..
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:40 AM
హోర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ను ఇరాన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్పై ప్రతీకార దాడులు మొదలెట్టింది.
టెహ్రాన్, జూన్ 10: హోర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ను ఇరాన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. హోర్ముజ్లో ఇరాన్ దూకుడును కట్టడి చేసేందుకు అపాచీ హెలికాప్టర్లతో పాటు రీపర్ డ్రోన్లు, ఎఫ్/ఏ-18, ఎఫ్-35 ఫైటర్ జెట్స్ను యూఎస్ వినియోగిస్తోంది. సోమవారం యూఎస్ ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్పై ప్రతీకార దాడులు మొదలెట్టింది. మంగళవారం సాయంత్రం యూఎస్ ఎయిర్ఫోర్స్, నేవీ దాడులు నిర్వహించాయి.
ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో బుధవారం తెల్లవారుజామున ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘కమాండర్ ఇన్ చీఫ్ (అధ్యక్షుడి) ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఇరాన్పై ఆత్మరక్షణ దాడులను మొదలెట్టాయి. సోమవారం యూఎస్ ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసినందుకు ప్రతిచర్యగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్కు అమెరికా ఇచ్చే సరైన సమాధానం ఇదే’ అని పేర్కొంది.
అమెరికా మా సంకల్పాన్ని పరీక్షిస్తోంది
అమెరికా ప్రతీకారదాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఎక్స్ వేదికగా బుధవారం తెల్లవారుజామున ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘యుద్ధభూమిలో ఓటములు ఎదురైనప్పటికీ.. అమెరికా మా సంకల్పాన్ని పరీక్షించాలని చూస్తోంది. మా శక్తివంతమైన సాయుధ దళాలు కచ్చితంగా బదులిస్తాయి. మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే మా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోండి. చొరబాటుదారులకు ఘోరమైన పరిస్థితులు ఏర్పడినట్లు పర్షియన్ గల్ఫ్ చరిత్రలో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత
నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..