ఆ వైపు వెళ్లవద్దు.. ఎయిర్లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ జెలెన్స్కీ వార్నింగ్
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:47 AM
ప్రపంచదేశాల ఎయిర్లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచదేశాల ఎయిర్లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలం దాదాపుగా మూతబడినట్టేనని చెప్పారు. ఆవైపు వెళ్లొద్దని హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేమేమీ పౌర విమానయాన సంస్థలను టార్గెట్ చేయడం లేదు. కానీ రష్యా గగనతలంలో భారీ స్థాయిలో డ్రోన్స్ ఉండటం వల్ల రిస్క్ను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. రష్యా ప్రారంభించిన యుద్ధం వల్ల ఆ దేశ గగనతలమే మూత పడే స్థితి వచ్చిందని చెప్పారు. సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో వంటి నగరాల గగనతలంలో విమానాలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ అద్యక్షుడి వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అవి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. తామూ ఉక్రెయిన్పై దాడులను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల కిర్గిస్థాన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా పుతిన్ ఉక్రెయిన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు చర్చలకు సిద్ధమేనని అంటున్నారు. కానీ ఉగ్రవాదులతో ఎలాంటి చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పాశ్చాత్య దేశాల ఎయిర్లైన్స్ ఇప్పటికే రష్యాకు విమానాల రాకపోకలను నిలిపివేశాయి. చైనా ఎయిర్లైన్స్ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇక రష్యా గగనతలంలో పౌర ఎయిర్లైన్స్ సంస్థలకు రిస్క్ ఉందని పౌరవిమానయాన రంగ కన్సల్టెన్సీ సంస్థ ఆస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది. ప్రస్తుతం, రష్యా సరిహద్దుకు 300 కిలోమీటర్ల లోపల వరకూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
ఈ వార్తలనూ చదవండి:
పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్
ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి