హోర్ముజ్లో సీమైన్స్ను తొలగించేందుకు 6 నెలల పట్టవచ్చు: పెంటగాన్
ABN , Publish Date - Apr 23 , 2026 | 09:16 AM
హోర్ముజ్ జలసంధిలో సీమైన్స్ను తొలగించేందుకు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా హోర్ముజ్ జలసంధిలో విషయంలో అనిశ్చితి మాత్రం ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించట్లేదు. హర్ముజ్లో ఇరాన్ అనేక సీమైన్స్ను అమర్చిన విషయం తెలిసిందే. వాటన్నిటినీ తొలగించి రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు కనీసం ఆరు నెలలు పట్టవచ్చని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అంచనా వేసింది. ఈ విషయం తాజాగా అమెరికా చట్టసభల సభ్యులకు వివరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ అమర్చిన సీమైన్స్లో కొన్నింటిని జీపీఎస్ ఆధారంగా ఏర్పాటు చేశారట. దీంతో, ఇవి ఎక్కడున్నాయో గుర్తించడం అమెరికా దళాలకు కొంత కష్టంగా మారిందని తెలుస్తోంది. మార్చి నెలలో ఇరాన్ సీమైన్స్ను అమర్చడం ప్రారంభించింది. వీటి సాయంతో ఇరాన్ కనీసం ఆరు నెలల పాటు హోర్ముజ్లో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని ఒక అమెరికన్ రక్షణ రంగ సంస్థ అంచనాకు వచ్చినట్టు కూడా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను పెంటగాన్ అప్పట్లోనే ఖండించింది. ఇది కచ్చితమైన సమాచారం కాదని తెలిపింది.
ఇక తాజా నివేదికపై అమెరికన్ చట్టసభల సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంధన ధరల భారం అంచనా కంటే ఎక్కువ సమయం పాటు కొనసాగే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లను దాటిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు: ఇరాన్ హెచ్చరిక
భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్న్యూస్ చెప్పిన కెనడా..