మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఖతం.. ట్రంప్ ప్రకటన
ABN , Publish Date - May 16 , 2026 | 11:40 AM
ఆఫ్రికాకు చెందిన మరో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్టును తమ దళాలు మట్టుపెట్టాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఆఫ్రికన్లకు ఒక పీడ విరగడయ్యిందని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రసంస్థ ఐసిస్కు చెందిన మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును మట్టుపెట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. నైజీరియా దళాలతో కలిసి అమెరికా దళాలు ఐసిస్ టెర్రరిస్టు అబూ బిలాల్ అల్ మినుకీని అంతం చేశాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలను పర్యవేక్షించే అతడు సంస్థలో నెం.2 నాయకుడిగా ఉండేవాడని ట్రంప్ చెప్పారు.
ఆఫ్రికాలో దాక్కుంటే తనను ఎవరు ఏమీ చేయలేరని అతడు భావించాడని అన్నారు. కానీ అతడి సమాచారం తమకు నిత్యం అందుతూనే ఉందన్న విషయాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఆఫ్రికా ప్రజలకు అతడి పీడ విరగడయ్యిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అతడి ఉగ్రనీడ తొలగిపోయిందని చెప్పారు. అబూ బిలాల్ అంతంతో ఐసిస్ గ్లోబల్ కార్యకలాపాలకు కూడా పెద్ద దెబ్బతగిలిందని చెప్పారు. ఈ మిషన్లో అమెరికా దళాలకు సహకరించిన నైజీరియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

అబూ బిలాల్ను అమెరికా ప్రభుత్వం 2023లో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అతడు పలు మారు పేర్లతో తన కార్యకలాపాలు నిర్వహిస్తాడని పేర్కొంది. అతడు ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అంతర్జాతీయంగా ఐసిస్ ఉగ్రకార్యకలాపాలకు అతడు నిధులు సమకూర్చేవాడు. ఐసిస్ ఉగ్రమూకల దాడులకు మార్గనిర్దేశనం కూడా చేసేవాడు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్పై మరోసారి దాడులు? ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ
అమెరికా క్షీణిస్తున్న దేశం.. చైనా అధ్యక్షుడి వ్యాఖ్య