సుంకాల సొమ్ము 45 రోజుల్లోగా వాపసు!
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:35 AM
ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన సొమ్మును 45 రోజుల్లోగా వాపసు చేయడానికి అమెరికా సిద్ధమైంది. దీనికి...
15.26 లక్షల కోట్లు చెల్లింపుపై కసరత్తు
వాషింగ్టన్, మార్చి 7: ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన సొమ్మును 45 రోజుల్లోగా వాపసు చేయడానికి అమెరికా సిద్ధమైంది. దీనికి సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేయడంపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీబీపీ అధికారి బ్రాండన్ లార్డ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వెల్లడించారు. చెల్లని సుంకాల కింద చేసిన చెల్లింపులను దిగుమతిదారులు తిరిగి పొందేందుకు వీలు కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా దాదాపు 3,30,000 మందికి సుమారు రూ.15.26 లక్షల కోట్ల సుంకం డబ్బును సీబీపీ తిరిగి ఇవ్వనుంది. ఈ అంశంపై చర్చించడానికి ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్తో ప్రభుత్వ న్యాయవాదులు శుక్రవారం సమావేశమయ్యారు. సుంకాల చెల్లింపు కోరుతూ ఫెడెక్స్, లోరియల్ వంటి కంపెనీలు సహా పలువురు దాఖలు చేసిన దాదాపు 2వేల పిటిషన్లను ఈటన్ పర్యవేక్షిస్తున్నారు. కాగా, సీబీపీకి చెందిన ఆటోమేటెడ్ కమర్షియల్ ఎన్విరాన్మెంట్ (ఏసీఈ) ద్వారా దిగుమతిదారులు తాము చేసిన చెల్లింపులను వివరిస్తూ ఒక డిక్లరేషన్ సమర్పించాలి. వాటిని పరిశీలించిన తర్వాత సదరు మొత్తాన్ని వడ్డీతో సహా సీబీపీ చెల్లించనుంది. ఎన్ని షిప్మెంట్లు ఉన్నప్పటికీ అన్నింటికీ కలిపి ఒకేసారి చెల్లింపు చేయనుంది. కాగా, ఫిబ్రవరి ప్రారంభం నాటికి మొత్తం 3,30,000 మంది దిగుమతిదారుల్లో కేవలం 21,423 మంది మాత్రమే సీబీపీ ఎలకా్ట్రనిక్ రిఫండ్ సిస్టమ్లో నమోదు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ