ఫేబుల్, మైథోస్ ఏఐ మోడళ్లపై ఆంక్షల ఎత్తివేత
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:38 AM
ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన అత్యంత శక్తిమంతమైన కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు ఫేబుల్ 5, మైథోస్ 5పై విధించిన ఆంక్షలను అమెరికా సర్కారు ఎత్తివేసింది...
న్యూయార్క్, జూలై 2: ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన అత్యంత శక్తిమంతమైన కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్లు ఫేబుల్ 5, మైథోస్ 5పై విధించిన ఆంక్షలను అమెరికా సర్కారు ఎత్తివేసింది. ఈ మోడళ్ల వల్ల కలిగే భద్రతాపరమైన ముప్పులను ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు, అలాంటివాటిపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేందుకు, భవిష్యత్తులో అభివృద్ధి చేసే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆంత్రోపిక్ సంస్థ అంగీకరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆ సంస్థకు ఒక లేఖ రాశారు. ఈ మోడళ్లు సంఘ విద్రోహ శక్తుల చేతికి చిక్కితే హ్యాకింగ్ ముప్పు పెరిగిపోతుందన్న కారణంతో ట్రంప్ సర్కారు వీటికి సంబంధించిన యాక్సెస్ అమెరికన్లకు తప్ప ఇతర దేశాలవారికి అందకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఆ ఆంక్షలను ఎత్తివేయడంతో వాటిని అందుబాటులోకి తెస్తామని ఆంత్రోపిక్ సంస్థ తెలిపింది. ఈమేరకు ఆ రెండు మోడళ్లూ భారత్లో వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది