యూఏఈలో ప్రధాని మోదీకి రక్షణగా ఎఫ్-16 యుద్ధ విమానాలు!
ABN , Publish Date - May 15 , 2026 | 03:13 PM
ప్రధాని మోదీకి యూఏఈ పర్యటన సందర్భంగా అపూర్వ స్వాగతం లభించింది. యూఏఈ గగనతలంలోకి ప్రధాని ఎయిర్ ఇండియా వన్ విమానం ప్రవేశించగానే యూఏఈ తన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఎస్కార్ట్గా పంపించింది.
ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ అరుదైన స్వాగతం లభించింది. దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా అబుదాబీ ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. అంతకుమునుపు, ప్రధాని ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే ఆయనకు రక్షణగా యూఏఈ తన ఎఫ్-16 బ్లాక్ 60 డెజర్ట్ ఫాల్కన్ ఫైటర్ జెట్లను పంపించింది. విమానం ఎయిర్పోర్టులో దిగాక యూఏఈ అధ్యక్షుడు ప్రధాని మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం, ప్రధాని యూఏఈ సైనిక బృందం గౌరవ వందనాన్ని స్వీకరించారు.
గల్ఫ్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారి తీస్తున్న తరుణంలో ప్రధాని మోదీ యూఏఈ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు అంశాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. యూఏఈపై జరిగిన దాడులను కూడా ప్రధాని మోదీ ఖండించారు. భారత్ ఎల్లప్పుడూ యూఏఈకి అండగా ఉంటుందని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో యూఏఈలోని భారతీయులకు అక్కడి ప్రభుత్వం సొంత కుటుంబసభ్యుల్లా రక్షణ కల్పించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్యకైనా చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కారాన్ని అన్వేషించాలనేదే భారత్ అభిమతమని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యూఏఈలో కొన్ని గంటల పాటే ఉండనున్న ప్రధాని ఆ తరువాత నెదర్లాండ్స్, స్వీడెన్, నార్వే, ఇటలీ దేశాల పర్యటనకు వెళతారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈకి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ
అమెరికా వీసాల కోసం భారతీయులు ‘వీసా ఆలయా’నికి వెళ్తారు!