ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది.. కానీ..: ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Aug 22 , 2026 | 10:28 AM
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదని ట్రంప్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. అయితే, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదన్నారు. శుక్రవారం నాడు దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్కు బయలుదేరే ముందు జాయింట్ బేస్ ఆండ్రూస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. 'ఇరాన్ వద్ద డబ్బు లేదు. వారికి నౌకాదళం, వైమానిక దళం లేదు. ఇరాన్ తన సైనికులు, పోలీసులకూ జీతాలు చెల్లించడం లేదు. అక్కడ 350 శాతం ద్రవ్యోల్బణం ఉంది. హోర్ముజ్ జలసంధి మొత్తం ప్రాంతంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఇరుదేశాల మధ్య ఒప్పందానికి ఇరాన్ ఆసక్తిగా ఉంది. అయితే వాషింగ్టన్ కోరిన షరతులను ఇంకా అంగీకరించ లేదు. నా అభిప్రాయంలో సరైన ఒప్పందం చేసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం' అని పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే ఇరాన్పై అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యలను ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరాన్ చమురు స్మగ్లింగ్ నెట్వర్క్లు, ఆర్థిక బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలతో సహా ఆ దేశ ఆర్థిక జీవనాధారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. టెహ్రాన్కు ఆర్థిక, వ్యాపార, ఇతర మార్గాల్లో ప్రభుత్వ మద్దతు అందిస్తున్న దేశాలు భారీ ఆర్థిక పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే, ఇరాన్ను ఏకాకిని చేసి ఓడించడానికి మిత్రదేశాలన్నీ అమెరికాకు అండగా నిలబడాలని కోరారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన..
మయన్మార్లో విషాదం.. బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది మృతి