ఓపీటీకి లక్ష డాలర్ల ఫీజు.. భారతీయులకు మరో షాకిచ్చేందకు రెడీ అవుతున్న యూఎస్
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:24 PM
భారతీయులకు మరో షాకిచ్చేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసా, ఓపీటీ ప్రోగ్రామ్లపై కొత్త ఫీజు విధించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలు రెడీ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు మరో షాకిచ్చేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసా, ఓపీటీ ప్రోగ్రామ్లపై కొత్త ఫీజు విధించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలు రెడీ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి పాలనాపరమైన అనుమతుల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఇమిగ్రేషన్ న్యాయసేవల సంస్థ ఫ్రాగోమన్ తెలిపింది. అయితే, నూతన చార్జీలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి? అనే అంశం ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రతిపాదనలపై అమెరికా గోప్యంగా వ్యవహరిస్తోంది.
ఫ్రాగోమన్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఓపీటీ ఫీజుకు సంబంధించిన ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎమ్బీ) సమీక్ష కోసం ఆగస్టు 20న పంపించినట్టు తెలుస్తోంది. కొన్ని రకాల హెచ్-1బీ వీసా పిటిషన్ల ఫీజును పెంచే ప్రతిపాదనపై ఓఎమ్బీ ఇప్పటికే సమీక్ష పూర్తిచేసి, ఆగస్టు 19న గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓపీటీ ఫీజు లక్ష డాలర్ల వరకూ పెంచే అవకాశం ఉందని మీడియా కథనాలను ఉటంకిస్తూ ఫ్రాగోమన్ పేర్కొంది. అయితే, ఈ విషయం పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదని కూడా చెప్పింది. ఎంత ఫీజును నిర్ణయించాలనే విషయంలో డీహెచ్ఎస్ పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని తెలిపింది.
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఫీజులను లక్ష డాలర్లను పెంచేందుకు ట్రంప్ సర్కారు గతంలో చేసిన ప్రయత్నాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కొత్త మార్గాల్లో ఫీజులను పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఏఐతో డ్రైవర్లపై వేటు.. ఉబెర్పై రూ.9,224 కోట్ల జరిమానా!
బంగ్లాదేశ్లో హిందూ కుటుంబం హత్య.. అదే ఇంట్లో స్నానం, భోజనం చేసిన నిందితులు..