కీవ్పై రష్యా భీకర దాడి.. హైపర్సోనిక్ క్షిపణితో విరుచుకుపడిన మాస్కో
ABN , Publish Date - May 24 , 2026 | 08:43 PM
నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇవాళ(ఆదివారం) అత్యంత భయానకమైన రాత్రి నమోదైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాలపై రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
కీవ్, మే 24: నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇవాళ(ఆదివారం) అత్యంత భయానకమైన రాత్రి నమోదైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాలపై రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో రష్యా తన అత్యాధునిక, అణు సామర్థ్యం గల 'ఓరేష్నిక్(Oreshnik)' హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీవ్పై జరిగిన అత్యంత భారీ వాయుదాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ భీకర దాడిలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ధ్వంసమైన నివాసాలు.. మెట్రో స్టేషన్లలో తలదాచుకున్న జనం
ఆదివారం తెల్లవారుజామున 1:00 గంట సమయంలో కీవ్ నగరం భారీ పేలుళ్లతో హోరెత్తిపోయింది. ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో.. భయాందోళనకు గురైన వేలాది మంది ప్రజలు రాత్రంతా భూగర్భ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. ఈ దాడిలో డజన్ల కొద్దీ నివాస భవనాలు, అనేక పాఠశాలలు, కార్యాలయాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. కీవ్ నగరంలోని ఓ ఐదంతస్తుల నివాస భవనం ముందుభాగం పూర్తిగా కూలిపోయింది. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ భవనం కిటికీలు ఈ పేలుళ్ల ధాటికి పగిలిపోయాయి. చరిత్రాత్మక ఇండిపెండెన్స్ స్క్వేర్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
మూడోసారి 'ఓరేష్నిక్' ప్రయోగం
రష్యా ఈ యుద్ధంలో 'ఓరేష్నిక్' క్షిపణిని ఉపయోగించడం ఇది మూడోసారి. వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని అడ్డుకోవడం ఏ రక్షణ వ్యవస్థకూ సాధ్యం కాదని గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
ఇక.. కీవ్కు దాదాపు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 లక్షల జనాభా కలిగిన 'బిలా త్సెర్క్వా(Bila Tserkva)' నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధ్రువీకరించారు. మొత్తంగా ఈ ఒక్క దాడిలోనే రష్యా 90 క్షిపణులు, 600 డ్రోన్లను ప్రయోగించి ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఓరేష్నిక్తో పాటు ఇస్కాందర్, కింజాల్, జిర్కాన్ క్షిపణులను కూడా రష్యా ఉపయోగించింది.
రష్యా వాదన.. ఉక్రెయిన్ వ్యూహం
తమ దేశంలోని పౌర లక్ష్యాలపై ఉక్రెయిన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ భారీ దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ సైనిక కమాండ్ కేంద్రాలు, వైమానిక స్థావరాలు, ఇంటెలిజెన్స్ విభాగాలు, సైనిక-పారిశ్రామిక కేంద్రాలను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నామని మాస్కో పేర్కొంది. అయితే.. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదన్న రష్యా వాదనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది.
రష్యా చేస్తున్న ఈ అరాచకానికి తగిన మూల్యం చెల్లించాలని అమెరికా, ఐరోపా దేశాలు తక్షణమే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వేసవి కాలం వస్తుండటంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున ఉక్రెయిన్ను ఇబ్బంది పెట్టడానికి రష్యా ఉద్దేశపూర్వకంగానే నీటి సరఫరా కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుందని జెలెన్స్కీ ఆరోపించారు.
తాజా దాడితో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణుల వినియోగం పాశ్చాత్య దేశాలలో ఆందోళన కలిగిస్తోంది. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, నాటో దేశాలు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటాయనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.