రొమాన్స్ స్కామ్.. రూ. 24 లక్షలు మోసపోయిన వృద్ధురాలు..
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:02 PM
సైబర్ నేరగాడు ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేశాడు. సైబర్ నేరగాడి మాయలో పడి.. ఆన్లైన్ రొమాన్స్ స్కామ్ కారణంగా ఆ వృద్ధురాలు 24 లక్షల రూపాయల డబ్బు పోగొట్టుకుంది.
బీజింగ్, జూన్ 12: సైబర్ నేరగాడు ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేశాడు. సైబర్ నేరగాడి మాయలో పడి.. ఆన్లైన్ రొమాన్స్ స్కామ్ కారణంగా ఆ వృద్ధురాలు 24 లక్షల రూపాయల డబ్బు పోగొట్టుకుంది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హాంకాంగ్కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలికి కొన్ని నెలల క్రితం ఫేస్బుక్లో ఓ వ్యక్తితో పరిచయం అయింది. ఆ వ్యక్తి తనను తాను చైనీస్ - అమెరికన్ డాక్టర్గా పరిచయం చేసుకున్నాడు. తాను యూఎస్ మిలటరీలో పని చేస్తున్నానని చెప్పాడు.
ఆ వ్యక్తి వృద్ధురాలి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తరచుగా ఆమెకు మెసేజ్లు చేసేవాడు. ఇలా ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఏర్పడింది. కొన్ని రోజులకు అది రొమాంటిక్ రిలేషన్గా మారింది. ఓ రోజు ఫోన్లో మాటల సందర్భంగా.. ‘నేను మిలటరీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నాను’ అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్లికేషన్ ఫీజు, అమెరికా వెళ్లిపోవడానికి విమాన ఛార్జీల కోసం 7 మిలియన్ హాంకాంగ్ డాలర్లను వృద్ధురాలి నుంచి తీసుకున్నాడు. పూర్తిగా అతడి మాయలో పడిపోయిన వృద్ధురాలు అతడు అడిగిన ప్రతిసారి పెద్ద మొత్తంలో డబ్బులు పంపింది.
అలా 1.6 మిలియన్ హాంకాంగ్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు 24 లక్షల రూపాయలు) పంపింది. అతడి నుంచి స్పందన లేకపోవటంతో వృద్ధురాలికి విషయం అర్థమైంది. పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు.. ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్ ద్వారా పరిచయం అయిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి
రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్: మంత్రి లోకేశ్
భవిష్యత్తులో డబ్బుకు విలువ.. మనుషులకు పని ఉండవు: మస్క్