సీక్రెట్ మీటింగ్లో అవమానం.. ఇరాన్ సుప్రీం లీడర్, అధ్యక్షుడి మధ్య మరింత పెరిగిన ఎడం?
ABN , Publish Date - Aug 05 , 2026 | 09:51 AM
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాతో జరిగినట్టు చెబుతున్న ఓ మీటింగ్ను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అవమానకరంగా భావించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు మధ్య ఎడం ఉందన్న వార్తలు ఇప్పటికే వెలుగు చూశాయి. అయితే, తాజాగా మొజ్తాబాతో జరిగినట్టు చెబుతున్న ఓ మీటింగ్ను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అవమానకరంగా భావించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా దాడుల్లో గాయపడ్డ తరువాత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రజల ముందుకు రాని విషయం తెలిసిందే. భద్రతా కారణాల రీత్యా ఆయన వివరాలను అక్కడి అధికారులు సీక్రెట్గా ఉంచుతున్నట్టు సమాచారం. మరోవైపు, పౌర అధికారులును లెక్కచేయకుండా ఇరాన్ సైనిక దళం పాలన మొత్తం తమ చేతుల్లోకి తీసుకుందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాతో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇటీవల ఓ ప్రాంతంలో సీక్రెట్గా సమావేశమైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతకుముందే రాజీనామా చేస్తానని పెజెష్కియాన్ పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో మొజ్తాబా ఈ సమావేశానికి అంగీకరించారని తెలుస్తోంది.
ఈ సమావేశం అత్యంత రహస్య ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. వెలుగు చొరబకుండా నల్లటి అద్దాలున్న కారులో కూర్చుని ఇరువురు కొన్ని నిమిషాల పాటే మాట్లాడుకున్నారు. అక్కడ చిమ్మచీకటిగా ఉండటంతో ఒకరికొకరు కనబడే పరిస్థితి కూడా లేదని సమాచారం. సుప్రీం లీడర్తో కరచాలనం చేసేందుకు కూడా పెజెష్కియాన్ను భద్రతా సిబ్బంది అనుమతించలేదని తెలిసింది. ఈ తీరు అవమానకరంగా ఉందని పెజెష్కియాన్ భావించి ఆగ్రహంగా వెళ్లిపోయినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాను మాట్లాడింది సుప్రీం లీడర్తోనేనా అనే సందేహాన్ని కూడా పెజెష్కియాన్ వెలిబుచ్చారు.
ఇరాన్ పాలన ప్రస్తుతం ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ కనుసన్నల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడైన తనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంపై పెజెష్కియాన్ అసంతృప్తితో ఉన్నారు. రాజీనామా చేస్తానని కూడా చెప్పినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈసారి రాజీనామా హెచ్చరికలు చేస్తే మోజ్తాబా ఆమోదిస్తారంటూ ఇటీవల ఒక వీడియో కూడా వైరల్గా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి