ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:50 AM
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది. మంగళవారం యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ దాడిలో ఎమ్ఎస్వీ ఫైజ్ నూరే ఓలియా షిప్ నీట మునిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది. మంగళవారం యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ దాడిలో ఎమ్ఎస్వీ ఫైజ్ నూరే ఓలియా షిప్ నీట మునిగింది. దాడి జరిగిన సమయంలో నౌకలో 14 మంది సిబ్బంది ఉన్నారు. యెమెన్ తీర ప్రాంత రక్షక దళం హుటాహుటిన రంగంలోకి దిగింది. నౌకలో ఉన్న 13 మంది భారతీయ సిబ్బంది సహా ఓ యెమెన్ వ్యక్తిని ప్రాణాలతో కాపాడింది. వారికి తక్షణ వైద్య సేవలు అందించింది.
యెమెన్ జలాల్లో భారత నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ దాడిపై ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. ‘భారతీయ నౌక ఎమ్ఎస్వీ ఫైజ్ నూరే ఒలియా యెమెన్ జలాల సమీపంలో క్షిపణి దాడికి గురైంది. దాడి కారణంగా ఆ నౌక తలకిందులై నీట మునిగిపోయింది. కారణం లేకుండా నౌకపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల భద్రతకే మా మొదటి ప్రాధాన్యత’..
‘సిబ్బందిలోని 14 మంది నావికులను యెమెన్ కోస్ట్ గార్డ్ రక్షించింది. వారిని పోర్టుకు తరలించింది. దాడి జరిగిన ప్రాంతంలో భారతీయ నావికుల సంపూర్ణ భద్రత కోసం.. క్షిపణి దాడిలో ప్రాణాలతో బయటపడ్డ సిబ్బందికి అవసరమైన సహాయం అందించడం కోసం అన్ని సంస్థలతో సమన్వయం చేసుకుంటూ తక్షణ చర్యలు చేపట్టాలని డైరెక్టర్ జనరల్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA)ను ఆదేశించాను’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
జట్టును వీడిన కోచ్లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్
ఇద్దరు జవాన్లను కాల్చిచంపి.. ఆపై ఆత్మహత్య