Share News

భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ఆఫర్

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:48 PM

భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ఆఫర్ చేశారు. భారత్‌తో కలిసి ఎస్‌యూ-57 ఉత్పత్తి చేసేందుకు సిద్ధమేనని చెప్పారు. సాంకేతికత బదిలీపై కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవని పుతిన్ పేర్కొన్నారు.

భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ఆఫర్
Putin on Su-57 Joint Manufacture with India

ఇంటర్నెట్ డెస్క్: ఐదో తరం ఫైటర్ జెట్స్‌ను సమకూర్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌యూ-57 యుద్ధ విమానాన్ని భారత్‌తో కలిసి సయుక్తంగా తయారు చేసేందుకు తాము సిద్ధమేనని అన్నారు. ఈ ఫైటర్ జెట్‌కు సంబంధించి కీలక సాంకేతికతలను కూడా భారత్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మీడియాతో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా తయారు చేసిన ఐదో తరం యుద్ధ విమానం జే-35ఏఈని పాక్ కొనుగోలు చేయనుందన్న వార్తలు ఇప్పటికే రక్షణ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యం పుతిన్ ఆఫర్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రస్తుతం భారత్ వద్ద 5వ తరం యుద్ధ విమానాలు లేవు. అయితే, మధ్యశ్రేణి 5వ తరం యుద్ధ విమానం అభివృద్ధికి భారత్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. 2035 నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు తక్షణ అవసరాల కోసం మరో ఫైటర్ జెట్‌ కోసం భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘భారత్‌కు ఈ ఫైటర్ జెట్‌ను సరఫరా చేసేందుకు మేము సిద్ధంగానే ఉన్నాము. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు, సమస్యలు లేవు. గగతనల రక్షణ వ్యవస్థలకూ ఇది వర్తిస్తుంది. వాస్తవానికి గతంలోనే ఈ విమానాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని మేము ప్రతిపాదించాము. కానీ ఈ ప్రాజెక్టులో మేము తరువాత చేరుతామని భారత్ చెప్పింది. మేము ఇప్పుడు దీన్ని సొంతంగానే నిర్మించుకున్నాము. అయితే, భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నాము’ అని పుతిన్ చెప్పారు. రక్షణ రంగంలో భారత్‌కు సహకరించే విషయంలో తాము ఎలాంటి పరిమితులు పెట్టుకోమని స్పష్టం చేశారు.


పాశ్చాత్య దేశాల నుంచి భారత్ అత్యాధునిక విమానాలు దిగుమతి చేసుకున్నప్పటికీ సాంకేతికత, కీలక సాఫ్ట్‌వేర్‌ బదిలీకి సంబంధించి చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ ఎస్‌యూ-57 విమానాల కొనుగోలుకు సిద్ధమైందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

శత్రుదేశ రాడాలర్లకు చిక్కకుండా ఉండేందుకు స్టెల్త్ టెక్నాలజీ, అత్యాధునిక ఏవియానిక్స్, అసాధారణ మెనూవరబిలిటీ ఉన్న ఎస్‌యూ-57‌ని బహుళార్థసాధక ఫైటర్ జెట్‌గా రష్యా అభివృద్ధి చేసింది. భూతల దాడులు, సముద్రదాడులతో పాటు గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేలా ఈ ఫైటర్‌జెట్‌‌‌ను డిజైన్ చేసింది. అయితే, తమ అవసరాలకు ఇది తగినది కాదని భారత వర్గాలు అప్పట్లో భావించాయి. ముఖ్యంగా విమానం స్టెల్త్ సామర్థ్యాలపై భారత్‌ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సాంకేతికత బదిలీకి సంబంధించి కూడా అభిప్రాయభేదాలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాకు చెందిన ఎఫ్-35, చైనాకు చెందిన జే-35తో పాటు ఎస్‌యూ-57 విమానాలే 5వ తరం ఫైటర్ జెట్స్‌గా గుర్తింపు పొందాయి. ఇక తమ ఎఫ్-35 విమానాలను అమెరికా కూడా భారత్‌కు ఆఫర్ చేస్తోంది. దీంతో, భారత్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలనూ చదవండి:

మోదీ నాకు మంచి ఫ్రెండ్.. త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్

మళ్లీ యుద్ధం ప్రకటించడానికి అదే మంచి కారణమవుతుంది: ట్రంప్

Updated Date - Jun 05 , 2026 | 01:31 PM