పెళ్లిళ్లల్లో ఇకపై ఒకటే వంటకం.. పాక్లో ఆదేశాలు జారీ
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:35 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాకస్థాయికి చేరుకున్న వేళ పాక్ ప్రభుత్వం కఠిన పొదుపు చర్యలకు సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాకస్థాయికి చేరుకున్న వేళ పాక్ ప్రభుత్వం కఠిన పొదుపు చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. ప్రభుత్వ వాహనాలకు పెట్రోల్, డీజిల్ కేటాయింపుల్లో కూడా సగానికి కోత విధించింది. అంతేకాకుండా, ఇంధన పొదుపు కోసం పెళ్లిళ్లల్లో ఇకపై ఒక్క వంటకమే వండుకోవాలని సామాన్య ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేబినెట్ నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. మూడు నెలల పాటు ఇవి అమల్లో ఉంటాయని కూడా తెలిపింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, మరో మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వ వర్గాల విదేశీ పర్యటనపై నిషేధం విధించారు. అత్యవసర సందర్భాల్లో మంత్రులు, సలహాదారులు ఆయా శాఖల అధికారులు విమానాల్లో ఎకానమీ క్లాస్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. షాపులు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను రాత్రి 9 గంటల కల్లా మూసేయాల్సి ఉంటుంది. ఫంక్షన్ హాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలు రాత్రి 10 గంటలకు మూసేయాలి. అయితే, రెస్టారెంట్లు, కేఫ్ వంటి వాటిని మాత్రం రాత్రి 11.00 గంటల వరకూ తెరిచి పెట్టి ఉంచవచ్చు. అయితే, ఆసుపత్రులు, ఫార్మసీలు, ఇంధన స్టేషన్లు వంటి వాటిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో విదేశీ మారకం పొదుపు కోసం ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెలలో కూడా పాక్ ప్రభుత్వం కొంతకాలం పాటు ఇలాంటి ఆంక్షలను అమలు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
పాకిస్థాన్ మసీదులో దారుణం.. 16 మంది మృతి
ఫిలిప్పీన్స్ స్కూల్లో కాల్పులు.. ఇద్దరి మృతి