ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:59 PM
భారత్-పాక్ విభజన సమయంలో మహ్మద్ అలీ జిన్నా అనారోగ్యాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన బాంబే డాక్టర్లు డా.జల్ రతన్ జీ పటేల్, డా. జల్ ధేభో కూ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కరానికి ఎంపిక అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఏ-ఇంతియాజ్ ఇద్దరు భారతీయులకు దక్కింది. భారత్-పాక్ విభజన సమయంలో మహ్మద్ అలీ జిన్నా అనారోగ్యాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన బాంబే డాక్టర్లు డా.జల్ రతన్ జీ పటేల్, డా. జల్ ధేభో కూలను తమ దేశ అత్యున్నత పౌర పురస్కరానికి ఎంపిక చేసినట్టు పాక్ మంత్రి ఎహ్సాన్ ఇక్బాల్ తాజాగా ప్రకటించారు. మరణానంతరం వారికి ఈ పురస్కారం దక్కింది.
భారత్-పాక్ విభజనకు ప్రధాన కారకుడు జిన్నా అన్న విషయం తెలిసిందే. అయితే, విభజన సమయానికే ఆయనకు మరణం తథ్యమని ఆ ఇద్దరు డాక్టర్లు తేల్చారు. 1930ల్లోనే జిన్నా క్షయ వ్యాధి (టీబీ) బారినపడ్డారు. విభజనకు ముందు జిన్నాను పరీక్షించిన ఇద్దరు డాక్టర్లు ఆయన టీబీ ముదిరిపోయిందని తెలుసుకున్నారు. మరో ఏడాది- రెండేళ్లకు మించి జిన్నా బతకడం కష్టమనే నిర్ణయానికి వచ్చారు. అయితే, వృత్తిపరమైన నిబద్ధతను పాటిస్తూ ఈ విషయాన్ని వారు జిన్నా సన్నిహితులు మినహా మరెవ్వరికీ చెప్పలేదు. పేషెంట్ల ఆరోగ్య వివరాలను ఇతరులెవ్వరితో పంచుకోకూడదన్న నియమాన్ని డాక్టర్లు పాటిస్తారన్న విషయం తెలిసిందే.
భారత జాతి పిత మహాత్మా గాంధీ, ప్రధాని నెహ్రూ, వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ వంటి దిగ్గజాలు సహా అప్పటి రాజకీయ ప్రముఖులు ఎవరికీ ఈ విషయం తెలియదని కోలిన్స్, లాపియర్లు తమ పుస్తకం ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్లో రాశారు. గాంధీ, నెహ్రూలకు ఆ విషయం తెలిసుంటే దేశ విభజన జరిగేదే కాదని అభిప్రాయపడ్డారు. ‘జిన్నా అనారోగ్యం విషయం తనకు తెలిసుంటే చరిత్ర మరో మలుపు తిరిగుండేది. దేశ విభజనను నేను వాయిదా వేసుండేవాడిని. అసలు పాక్ ఏర్పాటై ఉండేదే కాదు’ అని మౌంట్ బ్యాటన్ తమతో అన్నట్టు కోలిన్స్, లాపియర్లు తమ పుస్తకంలో పేర్కొన్నారు.
‘అత్యంత కీలక సమయంలో ఆ డాక్టర్లు ఇద్దరూ వృత్తిపరమైన నిబద్ధత కనబరుస్తూ గొప్ప సేవలందించారు. వారు గోప్యత పాటించినందుకే పాక్ దేశ ఏర్పాటు సాధ్యమైంది’ అని పాక్ మంత్రి ఎహ్సాన్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాది జరగనున్న కార్యక్రమంలో అధికారికంగా వారికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. పాక్ ఏర్పాటైన ఏడాది తరువాత 1948 సెప్టెంబర్ 11న జిన్నా మరణించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్
ఎన్టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!