పాకిస్థాన్లో అద్భుత ఘట్టం.. భక్తుల సందర్శనకు రాముడి కుమారుడి గుడి
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:18 PM
పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్న లవుడి(రాముడి కుమారుడు) దేవాలయం భక్తుల సందర్శన కోసం సిద్ధమైంది. శిథిలావస్థలో ఉన్న గుడిని ది వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ మరమ్మతులు చేసి పరిరక్షించింది. లాహోర్ కోటలో ఉన్న లవుడి గుడితో పాటు మరో రెండు కట్టడాలను డబ్ల్యూసీఎల్ఏ అధికారులు పరిరక్షించారు. పర్యాటకుల సందర్శన కోసం సిద్ధం చేశారు.
ఇస్లామాబాద్, జనవరి 27: పాకిస్థాన్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. లాహోర్లోని లవుడి(రాముడి కుమారుడు) దేవాలయం పర్యాటకుల సందర్శన కోసం సిద్ధమైంది. ది వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. లాహోర్లో ఉన్న అతి పురాతనమైన లవుడి గుడితో పాటు మరో రెండు కట్టడాలను అధికారులు పరిరక్షించారు. వాటికి మరమ్మత్తులు చేసి పూర్వ వైభవం తీసుకువచ్చారు. ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ పాకిస్థాన్ సహకారంతో మూడు కట్టడాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. 2018లో లవుడి గుడికి కొంత వరకు మరమ్మతులు జరిగాయి.
ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపి ప్రజల సందర్శన కోసం సిద్ధం చేశారు. ది వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ అధికార ప్రతినిధి తానియా ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ.. ‘లాహోర్ కోటకు సంబంధించిన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని సెలెబ్రేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ మూడు చారిత్రాత్మక కట్టడాలకు మరమ్మత్తులు జరిగాయి. కోటలో సిక్కు, హిందూ గుడులు, మొఘల్ కాలంనాటి మసీదులు, బ్రిటీష్ కాలానికి చెందిన పలు కట్టడాలు ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఆ కట్టడాలను పరిరక్షించడానికి అధునాతనమైన సాంకేతికతను వాడుతున్నాం’ అని ఆమె తెలిపారు.
కాగా, గత సంవత్సరం సిక్కు పరిశోధకులు లాహోర్ కోటలో 100 దాకా చారిత్రాత్మక కట్టడాలను గుర్తించారు. వాటిలో 30 వరకు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ది వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ అధికారులు మిగిలిన వాటిని పరిరక్షించటం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. లాహోర్ కోటకు పునర్ వైభవాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోటలో భాగమైన లవుడి గుడికి మరమ్మతులు జరిగాయి. హిందువుల నమ్మకం ప్రకారం.. రాముడి కుమారుడైన లవుడి పేరు మీదగానే లాహోర్ సిటీకి ఆ పేరు వచ్చిందని ఒక ప్రచారం ఉంది.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ ఈవెంట్లో డీకే నినాదాలు.. సహనం కోల్పోయిన సీఎం
ఇండియా-ఈయూ వాణిజ్య ఒప్పందం.. వీటి ధరలు భారీగా తగ్గుతాయి..