ఇండియా-ఈయూ వాణిజ్య ఒప్పందం.. వీటి ధరలు భారీగా తగ్గుతాయి..
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:55 PM
18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం వైన్, విస్కీ ప్రియులు, లగ్జరీ కార్ల అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది.
భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) పూర్తయింది. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం వైన్, విస్కీ ప్రియులు, లగ్జరీ కార్ల అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. (India-EU Free Trade Agreement).
ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారతీయ వస్తువులకు యూరోపియన్ మార్కెట్ల తలుపులు తెరుచుకుంటాయి. యూరప్ నుంచి దిగుమతి అయిన వస్తువులు భారతదేశంలో చౌకగా లభిస్తాయి. ఈ ఒప్పందాన్ని 'అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి' అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అభివర్ణించారు (India EU trade pact).
భారత్లో వీటి ధరలు తగ్గుతాయి:
ప్రస్తుతం యూకే నుంచి భారత్కు దిగుమతి అవుతున్న స్కాచ్ విస్కీ, జిన్పై 150 శాతం సుంకాలను విధిస్తున్నారు. తాజా ఒప్పందం నేపథ్యంలో ఆ సుంకాలు 20 శాతానికి తగ్గుతాయి. అయితే దీనిని వెంటనే కాకుండా 5-10 సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేస్తారు. దీంతో యూరప్నకు చెందిన ప్రీమియం జిన్లు, వైన్, వోడ్కాలు చౌకగా లభిస్తాయి. అలాగే భారతీయ మద్యానికి కూడా ఈయూ సభ్య దేశాలలో పన్ను మినహాయింపులు లభిస్తాయి (wine import tariff cut).
మెర్సిడెస్, బీఎమ్డబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ కార్లకు ప్రస్తుతం 100 శాతం పన్నులు విధిస్తున్నారు. ఒప్పందం తర్వాత ఆ పన్నులు నిర్ణయించిన కాల వ్యవధిలో పది శాతానికి తగ్గుతాయి. అయితే రూ. 25 లక్షల కంటే తక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉన్న కార్లను మాత్రం భారత్కు ఈయూ ఎగుమతి చేయదు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడానికి ఈ నిబంధన పెట్టారు (luxury cars cheaper India).

యూరప్ నుంచి దిగుమతి అయ్యే కేన్సర్, ఇతర తీవ్రమైన అనారోగ్యాల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలు కూడా తగ్గుతాయి. అలాగే యూరప్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వైద్య పరికరాల ధరలు కూడా తగ్గుతాయి (imported medicines price drop).
యూరప్ నుంచి దిగుమతి చేసుకునే విమానాల విడి భాగాలు, మొబైల్ ఫోన్లు, హైటెక్ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు తగ్గుతాయి. ఇది భారతదేశంలో గాడ్జెట్ల తయారీ ఖర్చులను తగ్గిస్తుంది. తుది వినియోగదారునికి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు చౌకగా లభించవచ్చు.

ఇనుము, ఉక్కు, రసాయన ఉత్పత్తులపై సున్నా సుంకాల ప్రతిపాదన ఉంది. దీని వలన నిర్మాణ, పారిశ్రామిక రంగాలలో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయి. అలాగే చాక్లెట్లు, సౌందర్య సాధనాలు, పలు గృహోపకరణాలు కూడా గతంలో కంటే చౌకగా లభిస్తాయి.
ఇక, భారత్లో తయారయ్యే వస్త్రాలు, పాదరక్షలు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నిచర్, క్రీడా వస్తువులు, రసాయనాలు, యంత్ర పరికరాలపై ఈయూ పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ మేరకు భారతీయ వస్త్ర, ఫుట్వేర్, ఆటో మొబైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థలు భారీగా లాభపడనున్నాయి.
ఇవి కూడా చదవండి..
సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్లు ఇంత గట్టిగా ఉంటాయా..
చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..