Share News

మీకోసమే ఎదురుచూస్తున్నాం!

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:09 AM

తమ భూభాగంపై భూతల దాడులకు పాల్పడితే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది. అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా...

మీకోసమే ఎదురుచూస్తున్నాం!

భూతల దాడికి వస్తే తిరిగి వెళ్లరు.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

ఇరాన్‌పై భూతల దాడులకు ట్రంప్‌ మొగ్గు!

టెహ్రాన్‌, జూలై 20: తమ భూభాగంపై భూతల దాడులకు పాల్పడితే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది. అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని, వారి రాక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఇరాన్‌ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొనేందుకు భూతల దాడులు చేసే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిశీలిస్తున్నారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఈ వార్తలపై ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘే సోమవారం తీవ్రంగా స్పందించారు. అమెరికా సైనికులు తమ భూభాగంపై దాడులకు వస్తే తిరిగి ఇళ్లకు వెళ్లలేరని హెచ్చరించారు. ఖర్గ్‌ ద్వీపాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తే ఇరాన్‌ సైనిక దళాల సత్తా చూస్తారని అన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విర మణ ఒప్పందాన్ని అమెరికా తోసిపుచ్చటం కుదరదని స్పష్టంచేశారు. ఆ ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో హోర్ముజ్‌ జలసంధిపై అధికారం పూర్తిగా ఇరాన్‌కే ఉంటుందని తెలిపారు.

ఇరాక్‌పై అమెరికా దాడులు తీవ్రం

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు 520 కి.మీ.దూరంలో ఉన్న తీర ప్రాంతనగరమైన తాబ్రిజ్‌పై అమెరికా క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒకరు మరణించారు. హోర్ముజ్‌ జలసంధిపైనా దాడులు చేయడంతో ఒక నౌకలో మంటలు వ్యాపించాయి. ఒమన్‌ దేశ తీరం సమీపంలో ఈ దాడి జరగడంతో ఆ నౌక సిబ్బంది అంతా దానిని అక్కడే విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు ఇరాన్‌ కూడా కువైట్‌, బహ్రెయిన్‌లలో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. దాడుల్లో అమెరికా సైనికుడు ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఇరుదేశాలూ పౌరుల వసతులను లక్ష్యంగాచేసుకొని దాడులు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 06:09 AM