అది విచారకరం.. భారత బడ్జెట్పై ఇరాన్ ఆర్థిక మంత్రి కామెంట్
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:45 AM
భారత బడ్జెట్లో చాబహార్ పోర్టు అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం విచారకరమని ఇరాన్ విదేశాంగ శాఖ మంద్రి అబ్బాస్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ పోర్టు ఏదోక రోజు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్లోని చాబహార్ పోర్టుకు (Chabahar Port) భారత బడ్జెట్లో ఈసారి నిధులు కేటాయించకపోవడంపై (Budget 2026-27) ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) స్పందించారు. ఇది విచారకరమని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యరూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్య ఆసియా దేశాలు, ఐరోపాతో భారత్ వాణిజ్యపరంగా అనుసంధానం అయ్యేందుకు ఈ పోర్టు కీలకమని కామెంట్ చేశారు. ఈ పరిణామం భారత్కు కూడా విచారం కలిగించేదేనని అభిప్రాయపడ్డారు.
హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు అనుసంధాంచే బంగారం ద్వారం చాబహార్ పోర్టు అని ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి అబ్బాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే భారత్ను ఇరాన్ మీదుగా మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు అనుసంధానించడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు. సరుకు రవాణాకు ఇది అత్యుత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. ఏదోక రోజు ఈ పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాక్లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. తద్వారా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్ని్స్తోంది. చైనాకు పోటీగా భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్టు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. పాక్కు ప్రత్యామ్నాయంగా ఇరాన్, అఫ్గానిస్థాన్ మీదుగా మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు సరుకులను చేర్చేందుకు పోర్టు కేంద్రంగా వాణిజ్య మార్గంపై దృష్టి పెట్టింది. అయితే, ఇరాన్పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
లా డిగ్రీ లేకున్నా న్యాయమూర్తిగా.. పాక్లో ఘటన
సుంకాల డబ్బును తిరిగివ్వండి! ట్రంప్నకు అమెరికన్ల డిమాండ్