Share News

ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. భయాందోళనలో ప్రజలు..

ABN , Publish Date - Jul 03 , 2026 | 10:55 AM

ఇండోనేషియాలో మరోసారి భూకంపం భయాందోళనలు సృష్టించింది. హల్మహేరా ప్రాంతంలో ఇవాళ (శుక్రవారం) 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది.

ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. భయాందోళనలో ప్రజలు..
Indonesia Earthquake

జకార్తా: ఇండోనేషియాలో మరోసారి భూకంపం భయాందోళనలు సృష్టించింది. హల్మహేరా ప్రాంతంలో ఇవాళ (శుక్రవారం) 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:31 గంటలకు ఈ భూకంపం వచ్చిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీని కేంద్రం ఇండోనేషియాలోని టెర్నాటేకు సుమారు 116 కిలోమీటర్ల ఉత్తరాన, 127 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. 1.8° ఉత్తర అక్షాంశం, 127.4° తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.


మరోవైపు సునామీ ప్రమాదం లేదని ఇండోనేషియా వాతావరణ, శీతోష్ణస్థితి, భూభౌతిక శాస్త్ర సంస్థ (BMKG) ధ్రువీకరించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని వస్తువులు ఊగిపోగా.. ప్రజలు మరోసారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో జూన్ 17న 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పలు ఇళ్లు, మౌలిక సదుపాయాలు కూడా ధ్వంసమయ్యాయి. కాగా, తాజా భూ ప్రకంపనలు ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేశాయి. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఫేబుల్‌, మైథోస్‌ ఏఐ మోడళ్లపై ఆంక్షల ఎత్తివేత

తక్షశిలకు మరమ్మతులు చేపట్టిన పాక్.. యునెస్కో తీవ్ర ఆగ్రహం..

Updated Date - Jul 03 , 2026 | 11:17 AM