సౌదీపై హూతీల దాడులు.. భారత్ ఆందోళన
ABN , Publish Date - Sep 16 , 2026 | 08:29 PM
సౌదీలోని మక్కా సమీపంలో డ్రోన్ దాడిపై భారత్ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీలోని మక్కా సమీపంలో డ్రోన్ దాడిపై భారత్ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పవిత్ర స్థలమైన మాక్కాకు సమీపంలో డ్రోన్ దాడి తీవ్ర ఆందోళన కలిగించింది. పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలని ఆశిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. సౌదీ అరేబియాపై దాడులను ఖండిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.
యెమెన్లోని హూతీలు ప్రయోగించిన డ్రోన్ను మంగళవారం మార్గమధ్యంలోనే కూల్చేశామని సౌదీ అధికారులు పేర్కొన్నారు. మక్కా గగనతలంలోకి ప్రవేశించక ముందే కూల్చేశామని అన్నారు. అయితే, ఈ దాడి తాము చేయలేదని హూతీలు స్పష్టం చేశారు. మక్కాకు తమతో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. 2015లో యెమెన్లో తిరుగుబాటుదారులు సానా నగరాన్ని ఆక్రమించిన సమయంలో సౌదీ దళాలు జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, పశ్చిమాసియాలో సరకు రవాణా నౌకలు, పౌర మౌలిక వసతులపై దాడులను భారత్ ఖండించింది. సౌదీ ఆర్థిక వసతులపై హూతీల దాడులతో ప్రాంతీయ సుస్థిరత దెబ్బతింటుందని, బాబ్ అల్ మాండెబ్ మీదుగా రాకపోకలకు ఆటంకాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
సుడాన్లో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 60 మంది మృతి
భారత్పై 100 శాతం టారిఫ్లు.. బిల్లుపై ఓటు వేయనున్న యూఎస్ హౌస్..!