గాజా స్ట్రిప్పై హమాస్ కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 06 , 2026 | 08:01 PM
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్లో తన పాలనకు ముగింపు పలుకుతున్నామని ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్లో తన పాలనకు ముగింపు పలుకుతున్నామని ప్రకటించింది. ఇప్పటివరకూ అక్కడ హమాస్ తరఫున పాలన సాగించిన వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా సారథ్యంలోని శాంతి మండలి ఏర్పాటు చేసిన నేషనల్ కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గాజాకు (ఎన్సీఏజీ) పరిపాలనను అప్పగించేందుకు సిద్ధమని పేర్కొంది. అయితే, శాంతి స్థాపన దిశగా ఇచ్చిన హామీలకు ఇజ్రాయెల్ కూడా కట్టుబడి ఉండాలని హమాస్ పేర్కొంది. దీంతో, గాజాలో పౌర పాలనకు మార్గం సుగమమైంది. హమాస్ నియమించిన పాలకవర్గం 2007 నుంచి గాజాలో వ్యవహారాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
హమాస్ ప్రకటనపై ఎన్సీఏజీ స్పందించింది. గాజా పగ్గాలను చేపట్టేందుకు తాము సిద్ధమేనని పేర్కొంది. గాజాలో తమ పాలన విజయవంతం కావడానికి ఒకే చట్టం, ఒకే పరిపాలన వ్యవస్థ కీలకమని పేర్కొంది. ఈ పరిణామంపై శాంతి మండలి కూడా స్పందించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని బట్టి తాము తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
గాజాలో శాంతి స్థాపనకు హమాస్, ఇజ్రాయెల్ మధ్య గతేడాది అక్టోబర్లో ఒప్పందం కుదిరింది. అమెరికా చొరవతో ఈ ఒప్పందం కుదిరింది. గాజాలో పాలనను పౌర పాలకులకు అప్పగించాలనేది ఇందులోని ప్రధాన డిమాండ్. హమాస్ ఆయుధాలను వదిలిపెట్టాలనేది మరో ముఖ్య అంశం.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు చరిత్ర లేదు.. నాగరికత లేదు: ఇరాన్
శ్రీలంక జైల్లో ఘర్షణలు.. 23 మంది ఖైదీల మృతి