శ్రీలంక జైల్లో ఘర్షణలు.. 23 మంది ఖైదీల మృతి
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:41 PM
శ్రీలంకలోని నెగోంబో జైల్లో ఆదివారం రాత్రి ఖైదీల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 23 మంది ఖైదీలు, నలుగురు గార్డులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలోని నెగోంబో పట్టణంలోని జైల్లో ఆదివారం రాత్రి ఖైదీల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో 23 మంది ఖైదీలు, నలుగురు గార్డులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. రెండు డ్రగ్స్ గ్యాంగ్ల మధ్య చెలరేగిన వివాదమే ఈ ఘర్షణలకు కారణమని పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారికి నెగోంబో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆదివారం రాత్రి ఘర్షణ మొదలైంది. జైల్లో వేల మంది ఖైదీలు ఉండటంతో ఘర్షణలు చూస్తుండగానే తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలో కొందరు మహిళా ఖైదీలు జైలు పైకప్పును ఎక్కి తమను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పైకప్పులో కొంత భాగం కూలిపోవడంతో ఖైదీలు కిందపడి గాయాల పాలయ్యారని కూడా పోలీసులు తెలిపారు. ఘర్షణల విషయం తెలియడంతో ఖైదీల బంధువులు జైలు వద్దకు చేరుకున్నారు. జైల్లో తుపాకీ పేలిన చప్పుళ్లు కూడా వినిపించాయని స్థానికులు కొందరు చెప్పారు. ఖైదీలను అడ్డుకునే ప్రయత్నంలో నలుగురు గార్డులు మరణించారని పోలీసులు తెలిపారు.
2020లో కూడా శ్రీలంకలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 117 మంది గాయపడ్డారు. కొవిడ్ సమయంలో ఈ ఘర్షణ తలెత్తడంతో ప్రభుత్వం అప్పట్లో ముందు జాగ్రత్తగా వందల మంది ఖైదీలను విడుదల చేయాల్సి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
పీవోకేలో భగ్గుమన్న ఆందోళనలు.. కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఒకరి మృతి
మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్కు నెతన్యాహు కౌంటర్