అప్పట్లో మా మధ్య ప్రేమ లేదు.. మస్క్ వీర్యదాత మాత్రమే: శివోన్ జిలిస్
ABN , Publish Date - May 07 , 2026 | 06:14 PM
ఓపెన్ ఏఐపై మస్క్ వేసిన కేసు విచారణలో తాజాగా ఆయన భాగస్వామి శివోన్ జిలిస్ కూడా హాజరయ్యారు. మస్క్తో తన సంబంధం గురించి పలు కీలక వివరాలు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓపెన్ ఏఐని లాభాపేక్ష కలిగిన సంస్థగా మార్చడాన్ని సవాలు చేస్తూ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసుకు సంబంధించి కాలిఫోర్నియాలోని (అమెరికా) ఒక ఫెడరల్ కోర్టులో ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మస్క్ భాగస్వామి శివోన్ జిలిస్పై కూడా ఓపెన్ ఏఐ న్యాయవాదులు పలు ఆరోపణలు చేశారు. ఓపెన్ ఏఐ బోర్డు డైరెక్టర్గా ఉన్న సమయంలో శివోన్ జిలిస్ సంస్థ వివరాలను మస్క్కు చేరవేశారని ఆరోపించారు.
ఈ క్రమంలో శివోన్ జిలిస్ బుధవారం కోర్టులో పలు కీలక వివరాలను వెల్లడించారు. ఓపెన్ ఏఐ ఆరోపణలను కొట్టిపారేశారు. తాను 2016లో ఓపెన్ ఏఐలో సలహాదారుగా చేరానని అన్నారు. ఈ క్రమంలో తనకు మస్క్తో పరిచయం అయ్యిందని చెప్పారు. 2020-23 మధ్య కాలంలో డైరెక్టర్గా కూడా చేసినట్టు చెప్పారు. దాదాపు దశాబ్దం క్రితం తాను మస్క్తో కొంతకాలం పాటు రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు చెప్పారు.
అయితే, 2020లో తాను తల్లిని కావాలనుకుంటున్న సమయంలో మస్క్ వీర్యదాతగా ఉంటానని ఆఫర్ చేసినట్టు తెలిపారు. అప్పటికి తమ మధ్య ఎలాంటి రోమాంటిక్ రిలేషన్షిప్ లేదని అన్నారు. తనకు ఉన్న కొన్ని అనారోగ్యాల కారణంగా పెళ్లికి, బదులు వీర్యదాత ద్వారా తల్లిని కావాలనుకున్నానని చెప్పారు. అయితే, మస్క్ కోరిక మేరకు తాను తన బిడ్డల తండ్రి ఎవరో గోప్యంగా ఉంచానని అన్నారు. ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచేందుకు మస్క్ తనతో ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలిపారు.
మొదట్లో బిడ్డల బాధ్యత మొత్తం తానే తీసుకున్నానని అన్నారు. ప్రస్తుతం తమకు నలుగురు సంతానమని, వారి జీవితాల్లో మస్క్ ఒక భాగమని కూడా ఆమె చెప్పారు. ప్రతివారం మస్క్ తమ నలుగురు పిల్లలకు కొంత సమయాన్ని కేటాయిస్తారని కూడా వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
సముద్రంలో చిక్కుకున్న భారత నౌక.. రక్షించిన పాకిస్థాన్