గాల్లో ఢీకొట్టుకున్న హెలికాప్టర్లు.. ఇద్దరి మృతి..
ABN , Publish Date - Aug 03 , 2026 | 06:41 AM
గ్రీసులో కార్చిచ్చును ఆపే ప్రయత్నంలో రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. దీంతో ఓ హెలికాప్టర్ గాల్లోనే పేలి, నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: గ్రీసులో కార్చిచ్చును ఆపే ప్రయత్నంలో రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. దీంతో ఓ హెలికాప్టర్ గాల్లోనే పేలి, నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఏథెన్స్లోని పసాతా తీరప్రాంత పరిధిలోని అట్టికా-బొయోటియా సరిహద్దుల్లో కార్చిచ్చును ఆర్పేందుకు గ్రీస్ ఫైర్ సర్వీస్ రెండు బెల్ హెలికాప్లర్లను రంగంలోకి దించింది.
హెలికాప్లర్లు కార్చిచ్చును ఆర్పుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఒకదానికి ఒకటి దగ్గరగా రావటంతో రెక్కలు ఢీకొట్టుకున్నాయి. దీంతో ఓ హెలికాప్లర్ గాల్లోనే పేలి, నేలపై కుప్పకూలింది. ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న పైలట్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు.
ఈ సంఘటనపై ది ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాసిల్లీస్ వత్రకోజిన్నిస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు హెలికాప్లర్లు గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న పైలట్లను ఆస్పత్రికి తరలించాము. అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు’ అని చెప్పారు. ఈ ప్రమాదంపై గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి
కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158
పర్వతారోహకుడు నిర్మల్ మృతదేహం లభ్యం