జాతీయ కవితా ఉత్సవం-2026.. విద్యార్థులకు అరుదైన అవకాశం
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:43 PM
2026- విద్యా సంవత్సరానికి గాను స్కూల్, కాలేజీ విద్యార్థులకు జాతీయ కవితా ఉత్సవం (National Poetry Festival) నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ, జులై 06: 2026- విద్యా సంవత్సరానికి గాను స్కూల్, కాలేజీ విద్యార్థులకు జాతీయ కవితా ఉత్సవం (National Poetry Festival) నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యార్థుల్లో సృజనాత్మకత, భావవ్యక్తీకరణతోపాటు సాహిత్య నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఓ నూతన వేదిక అవుతుందని పేర్కొంది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు తమ కవితా పఠన ప్రతిభను జాతీయ వేదికపై ప్రదర్శించడానికి ఇది ఓ అవకాశం అని వివరించింది.
విద్యార్థులు.. పేర్లు నమోదు చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి జులై 31 చివరి తేదీ అని విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇందులో పాల్గొనే విద్యార్థులు.. రాష్ట్రీయ ఈ పుస్తకాలయ వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్లో పొందుపరిచిన జాబితాలో నుంచి ఓ కవితను ఎంపిక చేసుకోవచ్చని సూచించింది.
విద్యాశాఖ మార్గదర్శకాలు అనుసరించి.. వీడియో 60 నుంచి 90 సెకన్ల నిడివి కలిగి ఉండాలి. అందులో స్పష్టమైన ఆడియో, రికార్డింగ్తోపాటు ముఖం కనిపించేలా ఉండాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండకూడదు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారు.. తమ సొంత ఖాతా ద్వారా కానీ లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఖాతా నుంచి గానీ వీడియోను అప్లోడ్ చేయవచ్చు.
ఎలా పాల్గొనాలి?
9 నుంచి 12వ తరగతి విద్యార్థులు జాతీయ పఠన పోటీ-2026లో పాల్గొనడానికి ఈ దశలు అనుసరించాలి.
ndl.education.gov.inని సందర్శించాలి.
OTP ద్వారా లాగిన్ అవ్వాలి లేదా నమోదు చేసుకోవాలి.
పేరు, పుట్టిన తేదీ, వయస్సు వివరాలు నింపాలి.
రాష్ట్రీయ కావ్య ఉత్సవ్ మెనూ కింద ఉన్న కవితల జాబితా నుంచి రాష్ట్రీయ ఇ పుస్తకాలయ వెబ్సైట్లో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
ముఖం స్పష్టంగా కనిపించేలా వీడియోను రికార్డు చేయాలి.
సోషల్ మీడియాలో వీడియోను అప్లోడ్ చేయాలి. రాష్ట్రీయ ఇ పుస్తకాలయ్ అని ట్యాగ్ చేయాలి. కింది హ్యాష్ట్యాగ్ని ఉపయోగించాలి.
#RashtriyakavyaUtsav
సోషల్ మీడియా పోస్ట్ లింక్ను కాపీ చేసి, అధికారిక పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
విద్యార్థి సమాచారంతోపాటు పాఠశాల వివరాలను అందులో నింపాలి.
ఏఐ పద్దతిని వినియోగించ కూడదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
భారతదేశంలోని ఏ పాఠశాలలోనైనా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీలో పాల్గొనే వారి నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయరు. ఇది పూర్తిగా ఉచితం.