సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి.. 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:35 PM
సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్పై భారీ స్థాయిలో సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు బోర్డు వెల్లడించింది. కేవలం రెండు నిమిషాల్లోనే 15 లక్షల హిట్స్ నమోదు కావడంతో పాటు లక్షకు పైగా అనధికారిక ఫైల్ యాక్సెస్ ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: సీబీఎస్ఈ (CBSE) రీవాల్యూయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తుల కోసం ప్రారంభించిన పోర్టల్పై సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు బోర్డు తెలిపింది. అయితే, ఈ దాడుల మధ్య కూడా పోర్టల్ ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసిందని తెలిపింది. రీవాల్యూయేషన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే కొందరు దుండగులు పోర్టల్ సేవలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ముఖ్యంగా ‘డినయల్ ఆఫ్ సర్వీస్’ (DoS) అనే సైబర్ దాడి ద్వారా పోర్టల్ సేవలను ప్రభావితం చేయాలని ప్రయత్నించినట్లు తెలిపింది.
సీబీఎస్ఈ తెలిపిన వివరాల ప్రకారం, కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే పోర్టల్పై సుమారు 15 లక్షల రిక్వెస్టులు (హిట్స్) వచ్చాయి. అంతేకాకుండా, సిస్టమ్లోని ఫైళ్లను అనధికారికంగా యాక్సెస్ చేయడానికి లక్షకు పైగా ప్రయత్నాలు జరిగినట్లు సీబీఎస్ఈ తెలిపింది. వేలాది మంది విద్యార్థులు ఒకేసారి పోర్టల్ను ఉపయోగిస్తున్న సమయంలో, సైబర్ దుండగులు సేవలకు అంతరాయం కలిగించేందుకు పలు దాడులకు పాల్పడ్డారని బోర్డు వెల్లడించింది. అయితే ఈ దాడులు జరిగినప్పటికీ పోర్టల్ సమర్థవంతంగా పనిచేసిందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఒకేసారి 8,000 మందికి పైగా వినియోగదారులు సేవలను ఉపయోగించగలిగే విధంగా వ్యవస్థను రూపొందించామని తెలిపింది.
మధ్యాహ్నం 3 గంటల నాటికి 18,000కు పైగా రీవాల్యూయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తులు విజయవంతంగా నమోదు అయినట్లు సీబీఎస్ఈ తెలిపింది. విద్యార్థుల సూచనల మేరకు పోర్టల్లో పలు మార్పులు కూడా చేసినట్లు బోర్డు వెల్లడించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి సెషన్ టైమ్ లిమిట్ను పెంచినట్లు పేర్కొంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు తమ సాంకేతిక బృందాలు పోర్టల్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News