Right To Protest: నిరసన నేరమైతే ప్రజాస్వామ్యం పతనమే!
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:22 AM
దేశంలో నిరసనోద్యమాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు మొదలుపెట్టింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరిగిన నిరసనోద్యమాలు, కారణాలు, సాధించిన ఫలితాలు, వాటికి...
దేశంలో నిరసనోద్యమాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు మొదలుపెట్టింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరిగిన నిరసనోద్యమాలు, కారణాలు, సాధించిన ఫలితాలు, వాటికి నాయకత్వం వహించిన వారి వ్యక్తిగత ప్రయోజనాలు తదితర అంశాలపై అధ్యయనం చేసి, ఒక సమగ్ర నివేదికను అందించే పనిని ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’ (BPR&D)కు అప్పగించారు. మరీ ముఖ్యంగా, 1974 తరువాత సాగిన ఉద్యమాల మీద లోతైన విశ్లేషణ జరపాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇందుకోసం, అన్ని రాష్ట్రాలూ తమవద్ద ఉన్న రికార్డులను పంపాలని లేఖలు రాసింది. భవిష్యత్ ఆందోళనల నివారణకు ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) రూపొందించాలని కూడా కేంద్రం భావిస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తి అయితే దేశంలో నిరసనలు, ఆందోళనల్ని నిషేధిస్తూ ఒక బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశమూ ఉన్నది. అది ఆమోదం పొంది చట్టంగా కూడా మారవచ్చు.
ప్రజాస్వామిక వ్యవస్థలో సమ్మెలు, ఆందోళనల్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది గానీ, వాటిని నిర్మూలించే అధికారం ఉండదు. నియంత్రణకూ, నిర్మూలనకూ మధ్య ప్రజాస్వామిక అవగాహనలో చాలా వ్యత్యాసం ఉంది. అవి రెండూ పరస్పర వ్యతిరేక అంశాలు. కార్మికులకు సమ్మె చేసే హక్కు, ప్రజలకు నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం. వాటిని తొలగిస్తే ఆ ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద హత్య చేసినట్టే. వ్యక్తులకు ఉండే భావప్రకటన స్వేచ్ఛ సమూహ స్థాయిలో నిరసన స్వేచ్ఛగా మారుతుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనడం కూడా సరికాదు; ఆ పునాదుల మీదనే రాజ్యాంగం అవతరించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటేనే నిరసన హక్కు. ఆ విలువలను పరిరక్షించడానికే ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలనే నియమం రూపొందింది. అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుకు ఆమోదం తెలిపే అవకాశంతోపాటు, నిరసనతో గద్దెదించే అవకాశాన్ని కూడా ఎన్నికలు ప్రజలకు ఇస్తాయి. వీటిల్లో మొదటిదానికన్నా రెండోదే కీలకం. సమ్మెలు, నిరసనలు, ఉద్యమాల ద్వారా ప్రజలు తమ కోర్కెలను పాలకుల దృష్టి తెస్తారు. తద్వారా విధానాలను సరిదిద్దుకునే, కొత్త వాగ్దానాలను రూపొందించుకునే అవకాశం అధికార పార్టీకే కాక, ఇతర రాజకీయ పార్టీలకు కూడా కలుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియను నిరోధించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. సంఘ పరివార్కూ, దాని రాజకీయ వేదిక అయిన భారతీయ జనతా పార్టీకీ– రాజకీయాల్లో గాంధీజీ, ప్రభుత్వ నిర్వహణలో రాజ్యాంగం అంటే అస్సలు పడదు. ఆ విషయాన్ని వాళ్ళేమీ దాచుకోరు. మొదటి నుంచీ బాహాటంగానే చెపుతూ వస్తున్నారు.
రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే నిజాం సంస్థానంలోని తెలంగాణలో రైతులు సాయుధులై స్థానిక జాగీర్దాలతో హోరాహోరీగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలను నిషేధించాలని రాజ్యాంగసభ భావించలేదు. అలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని కల్పించిన రాజరిక వ్యవస్థను రద్దు చేయాలనుకుంది. భూస్వామ్య వ్యవస్థను నియంత్రించాలనుకుంది. రైతులు, వ్యవసాయ కూలీల హక్కులకు రక్షణ కల్పించాలనుకుంది. కుల వివక్షను శిక్షించాలనుకుంది. ఈ ఆదర్శాలకు అనుగుణంగానే తరువాతి కాలంలో అనేక చట్టాలు వచ్చాయి. 1990ల్లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించక ముందు ప్రభుత్వాలు చేసిన ప్రజానుకూల చట్టాలన్నీ ప్రజాందోళనలతో సాధించుకున్నవే. కార్మిక హక్కుల చట్టాలు, అటవీ భూముల మీద ఆదివాసులకు హక్కు కల్పించే చట్టాలు, భూపరిమితి చట్టాలు సమస్తం ప్రజాందోళనలకు తలొగ్గి వచ్చినవే. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన పాత్ర కూడా మహత్తరమైనది. ‘ఏ చట్టం ఏ ఉద్యమ ఫలితంగా వచ్చింది’ అనేదాన్ని వివరిస్తూ ఒక పట్టిక తయారు చేయవచ్చు.
ఇటీవలి కాలంలోనే పలు ఉదాహరణలు ఉన్నాయి. ‘ఉన్నావ్’ అత్యాచారం కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న బీజేపీ నేత కుల్దీప్సింగ్ సెంగార్ను విడుదల చేయించుకోడానికి ఢిల్లీ పెద్దలు చేసిన కృషి ఇటీవల ఫలించింది. కానీ, దానిని నిరసిస్తూ మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితురాలి పక్షాన గట్టిగా నిలిచాయి. ‘ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు’ అనడం కన్నా ‘ప్రజాందోళనలు వాళ్ళను దిగివచ్చేలా చేశాయి’ అనడం సబబు. అలాగే, మైనింగ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆరావళి పర్వతశ్రేణుల ఎత్తును వందమీటర్లుగా కొత్త నిర్వచనం ఇవ్వడం కూడా వివాదంగా మారింది. ఈ నిర్వచనం సుప్రీంకోర్టు ఆమోదాన్ని పొందినా సరే దానికి వ్యతిరేకంగా ప్రజాందోళన సాగింది. మరోసారి ప్రభుత్వ పెద్దలు దిగిరావలసి వచ్చింది. రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ సహా గతంలోనూ మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సాగించింది నిస్సందేహంగా నియంతృత్వమే. అయితే, ఇప్పుడు మనం చూస్తున్నది మతతత్త్వ నియంతృత్వం. ప్రజల్నీ, ప్రజాస్వామిక హక్కుల్నీ నియంతృత్వం క్రూరంగా అణిచివేస్తున్నది. మతతత్త్వ నియంతృత్వం అంతకన్నా నాలుగు అడుగులు ముందుకేసి, ప్రజల్ని మతప్రాతిపదికన చీల్చి మెజారిటీ సమూహాన్ని మైనారిటీ సమూహం మీదికి ఉసిగొల్పుతున్నది. నియంతృత్వం సరళమైనది. ప్రజలందరూ ఏకం అవుతారు కనుక దాన్ని ఎదుర్కోవడం సులువు. మతతత్త్వ నియంతృత్వం సంక్లిష్టమైనది. ప్రజల్లో అది తెచ్చిన కృత్రిమ చీలిక ఉంటుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి అదనపు ఉపాయాలు అవసరం అవుతాయి.
2014 తరువాత ప్రజాస్వామిక విలువలు మరింత గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత కరెన్సీ మీద గాంధీ బొమ్మ ఉంటుందిగానీ, భారత ప్రభుత్వ విధానాల్లో గాంధీ ఆలోచనలు ఉండవు. పైగా, అనుక్షణం గాంధీ ఆలోచనల్ని విమర్శించే ప్రకటనలే చేస్తుంటారు. అంతకుముందు వరకు ప్రజా నిరసనల్ని ప్రజాస్వామ్య ఒత్తిడి సాధనంగా భావించే ఆలోచనావిధానం ఉండేది. ఇప్పుడు దాన్ని పాలనకు ముప్పుగా, దేశభద్రతా సమస్యగా చిత్రీకరిస్తున్నారు. గతంలో విభిన్న చట్టాల మీద ప్రజాభిప్రాయాన్ని రాజ్యాంగ హక్కుగా చూసేవారు. ఇప్పుడు దాన్ని ప్రజాక్రమశిక్షణ రాహిత్యంగా చూస్తున్నారు. దేశ భద్రతకు ముప్పు అంటున్నారు. గతంలో కార్మికుల సమ్మె హక్కును సామూహిక చర్చగా గుర్తించేవారు. ఇప్పుడు ఆర్థిక నష్టం కలిగించే చర్యగా ముద్ర వేస్తున్నారు. అప్పట్లో ఆందోళనలు జరిగితే చర్చలకు పిలిచేవారు, ప్రత్యేక కమిటీలను నియమించి, ఆ కమిటీల సిఫార్సుల మేరకు అవసరమైతే వెనక్కు తగ్గేవారు. ఇప్పుడు నిరసనకారుల మీద ఎదురుదాడికి దిగుతున్నారు, వారికి నాయకత్వం వహించేవారిని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నింటికన్నా, మౌనంగా ఉండిపోవడం ఇప్పుడు గొప్ప ఉపాయంగా మారిపోయింది. మణిపూర్ అల్లర్ల మీద ప్రధాని ప్రతిస్పందన ఏమిటో చూశాం! ఇంతకుముందు దేశానికి ముప్పు సరిహద్దులకు ఆవలినుంచి ఉందనేవారు, ఇప్పుడు ముప్పు అంతర్గతంగా ఉందంటున్నారు. ప్రజాస్వామ్య పతనం 2014కు ముందు ఆ తరువాత అని బేరీజు వేసుకుంటే ముంచుకొస్తున్న ప్రమాదం అర్థం అవుతుంది, ఏం చేయాలో కూడా బోధపడుతుంది.
డానీ
ఇవి కూడా చదవండి..
డ్రోన్లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి