నాలుగేళ్ల పాటు కలిసున్నాక పెళ్లికి బాయ్ఫ్రెండ్ నిరాకరణ.. మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:47 PM
నాలుగేళ్లుగా తనతో సహజీవనం చేసిన బాయ్ఫ్రెండ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఆగ్రాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కానిస్టేబుల్గా చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసు ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల పాటు తనతో సహజీవనం చేసిన బాయ్ఫ్రెండ్ చివరకు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడ్డారు. యూపీలోని ఆగ్రాలో ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు మహిళ తన బాయ్ఫ్రెండ్పై ఆరోపణలు గుప్పిస్తూ వీడియో చేశారు.
బాధితురాలి కథనం ప్రకారం, తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న జేవీ గౌతమ్ అనే వ్యక్తితో ఆమె నాలుగేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. అయితే, గౌతమ్ ఇటీవలే మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె ఆరోపించారు. ఇన్నాళ్లుగా తాము భార్యాభర్తల్లా ఒకే ఇంట్లో కలిసున్నామని చెప్పారు. చివరకు గౌతమ్ పెళ్లికి నో చెప్పడంతో తాను దారుణంగా మోసపోయానని వాపోయారు. పోలీసు స్టేషన్కు వెళ్లినా ఫలితం లేకపోయిందని చెప్పారు.
తనతో పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోరని గౌతమ్ చెప్పాడని ఒక వీడియోలో బాధితురాలు ఆరోపించారు. ఇంతలా మానసిక వేదనకు గురి చేసి, తనకు మరోదారి లేని స్థితిలో పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లుగా తనతో కలిసున్న వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జేవీ గౌతమ్తో పాటు అతడి కుటుంబమే తన ఆత్మహత్యకు కారణమని వీడియోలో ఆమె చెప్పారు. బతికున్నప్పుడు తనకు న్యాయం దక్కలేదని, కనీసం మరణం తరువాతైనా న్యాయం దక్కేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాస్గంజ్ జిల్లాకు చెందిన మహిళకు గతంలో వివాహం కాగా డైవర్స్ తీసుకున్నారు. ఆగ్రాలో ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్న సమయంలో ఆమెకు కానిస్టేబుల్ గౌతమ్ పరిచయం అయ్యాడు. ఇక బాధితురాలి వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలూ చదవండి: