మనిషి చావుబతుకుల్లో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా.. వైరల్ వీడియో
ABN , Publish Date - Feb 03 , 2026 | 08:34 PM
రోడ్డుపై కుప్పకూలిపోయి చావుబతుకుల మధ్య పోరాడుతున్న వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చోరీ చేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అతడు సడెన్గా రోడ్డుపై కుప్పకూలిపోయాడు. చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. అటుగా వచ్చిన ఓ వ్యక్తి బాధితుడిని చూసి వాహనం దిగాడు. కానీ కింద పడ్డ వ్యక్తికి సాయం చేయకుండా అత్యంత హేయంగా అతడి మొబైల్ ఫోన్ను ఎత్తకెళ్లిపోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది (Delhi Man Collapse on Road).
ఢిల్లీలోని వికాస్ నగర్ ఏరియాలో ఫిబ్రవరి 1న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ వ్యక్తి గుండె పోటు లేదా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. అతడు నరకం అనుభవిస్తున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. స్కూటీ వెనుక సీటుపై కూర్చొన్న వ్యక్తి వాహనం దిగి బాధితుడి ఫోన్ తీసుకున్నాడు. తరువాత ఇద్దరూ కలిసి వాహనంపై ముందుకెళ్లారు (Delhi Viral Video).
ఆ తరువాత మళ్లీ వెనక్కు వచ్చి మరోసారి బాధితుడి జేబులు వెతికారు. జేబుల్లో ఏమీ లేవని నిర్ధారించుకున్నారు. ఆ తరువాత సీసీటీవీ కెమెరాలు ఏమైనా తమను రికార్డు చేస్తున్నాయేమో అని తలపైకెత్తి అటూఇటూ చూసి చెక్ చేసుకున్నారు. తరువాత వెళ్లిపోయారు. నేలమీద పడి ఉన్న వ్యక్తి గిలగిలా కొట్టుకుంటున్నా కనీసం పట్టించుకోనూ లేదు. వారు వెళ్లిపోయాక కొన్ని గంటలపాటు అలా రోడ్డుపై హృదయవిదారకంగా కొట్టుమిట్టాడిన బాధితుడు చివరకు కన్నుమూశాడు. మరుసటి రోజు ఉదయం స్థానికులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడి ఫోన్ను చోరీ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి:
సర్పంచ్గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు