Share News

ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?

ABN , Publish Date - Mar 01 , 2026 | 08:02 AM

భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న ఇరాన్ యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలక ప్రాంతం. ఇక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇంధన, సరుకు ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది.

ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?
India oil supply risk

భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉన్న ఇరాన్ యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలక ప్రాంతం. ఇక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇంధన, సరుకు ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఉద్రిక్తతలు భారీ నష్టాన్ని తీసుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. మనదేశం ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా ఈ మార్గం ద్వారానే జరుగుతాయి (US Israel strikes Iran).


ప్రస్తుతం భారత్‌ చమురు దిగుమతుల్లో 50 శాతం ఈ హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతున్నాయి. ఇరాన్‌ను ఒమన్, యూఏఈల నుంచి వేరు చేసే ఈ జలసంధి ద్వారానే భారత్ రోజుకు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్ నుంచి భారత్‌కు ముడి చమురు వస్తుంటుంది. అలాగే 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను భారత్ ఈ హార్ముజ్ జలసంధి గుండానే ఎగుమతి చేస్తుంటుంది (Strait of Hormuz India impact).

ind2.jpg


ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో అమెరికా బలగాలు మోహరించడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు సుమారు పది శాతం మేర పెరిగాయి. మనదేశంలో వినియోగించే చమురులో 85 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఈ జలసంధి రవాణాకు పాక్షిక ఆటంకం ఏర్పడినా చమురు ధరలు 30 నుంచి 40 శాతం మేర పెరగొచ్చు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే భారత్ కరెంట్ లోటు ఖాతా తీవ్రమవుతుంది (India oil supply risk).


చమురు దిగుమతుల కోసం మనదేశం డాలర్లలో చెల్లిస్తూ ఉంటుంది. ధరలు పెరిగితే మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రూపాయి విలువ మరింత పతనమవుతుంది. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఆ ప్రభావం సరుకుల రవాణాపై పడుతుంది. అలాగే గల్ఫ్ దేశాలు గగన తలాలు మూసివేయడంతో అమెరికా, యూరప్ వేళ్లేందుకు మరింత ఎక్కువ సమయం, ఎక్కువ ఇంధనం అవసరమవుతాయి. ఫలితంగా విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరుగుతాయి (Middle East conflict energy).


భారత్ నుంచి హార్ముజ్ జలసంధి ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే బాస్మతీ రైస్, సుగంధ ద్రవ్యాలు, ఫార్మా, టీ ఉత్పత్తులు తదితరాలపై కూడా ప్రభావం పడొచ్చు (Oil import vulnerabilities). ఇక, స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యే ప్రమాదం ఉంది. ఈ ఉద్రిక్తతలు ఎంత కాలం కొనసాగితే మార్కెట్లు అంత ఎక్కువగా నష్టపోయే ప్రమాదముంది. అలాగే మదుపర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపితే బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతుంది.


ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 01 , 2026 | 08:36 AM