Share News

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల్లో రూ.లక్ష వరకు ఓటీపీ అక్కర్లేదు..

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:20 AM

విద్యుత్‌, గ్యాస్‌, వాటర్‌ బిల్లులు, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ తదితర ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్స్‌ చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ఆటో డెబిట్‌ వసతిని...

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల్లో రూ.లక్ష వరకు ఓటీపీ అక్కర్లేదు..

బీమా ప్రీమియం, సిప్‌ ఆటో పేమెంట్స్‌కు సైతం.. ఇతర సేవల చార్జీల్లో రూ.15,000 వరకు నో ఓటీపీ

  • నిబంధనలు సడలించిన ఆర్‌బీఐ

ముంబై: విద్యుత్‌, గ్యాస్‌, వాటర్‌ బిల్లులు, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ తదితర ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్స్‌ చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ఆటో డెబిట్‌ వసతిని ఎంచుకున్నప్పటికీ, ప్రతిసారీ చెల్లింపు జరిగేటప్పుడు ఓటీపీ ఎంటర్‌ చేసి విసుగొస్తోందా..? మీలాంటి వారికి తరచు చేసే చెల్లింపులను (రికరింగ్‌ పేమెంట్స్‌) మరింత సులభం చేసేందుకు ఆర్‌బీఐ నిబంధనలను సడలించింది. రూ.15,000 వరకు ఆటోమేటిక్‌ చెల్లింపులను ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) నిబంధన నుంచి మినహాయించింది. ఈ పరిమితికి మించి చెల్లించాల్సి వస్తే మాత్రం ఓటీపీ ఎంటర్‌ చేయాల్సిందే. బీమా ప్రీమియం, మ్యూచువల్‌ ఫండ్‌లో క్రమానుగుత పెట్టుబడులు (సిప్‌), క్రెడిట్‌ కార్డు పేమెంట్లకైతే రూ.లక్ష వరకు ఇక ఓటీపీ అవసరం లేదు.

తొలిసారి.. తప్పనిసరి

ఏదైనా సేవల రుసుమును ప్రతినెలా లేదా నిర్దిష్ట సమయానికోసారి చెల్లించేందుకు ఆటో డెబిట్‌ (నిర్దేశిత తేదీ నాడు వినియోగదారు ఖాతా నుంచి నేరుగా సొమ్మును బదిలీ చేసుకోవడం) వసతిని ఎంచుకున్న మొదటిసారి మాత్రం బిల్లు మొత్తంతో సంబంధం లేకుండా ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సిందే. ఆ తర్వాత చెల్లింపులకు ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితి వరకు ఓటీపీ మినహాయింపు లభిస్తుంది.


అలర్ట్‌ ఎస్‌ఎంఎ్‌సలు కొనసాగుతాయ్‌..

ఓటీపీ అవసరం లేకుండానే మీ అకౌంట్‌ నుంచి నేరుగా డబ్బులు కట్‌ అయినప్పటికీ, మీ బ్యాంక్‌ మీకు చెల్లింపు జరగబోయే కనీసం 24 గంటల ముందు, చెల్లింపు జరిపాక ఎస్‌ఎంఎస్‌ ద్వారా అప్రమత్త సందేశాన్ని పంపించే ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది.

వినియోగదారుకు

ఏమేర ప్రయోజనం..?

ఆర్‌బీఐ నిబంధనల సడలింపుతో ఆటో డెబిట్‌ లావాదేవీల్లో ఓటీపీల అవసరం తగ్గడంతోపాటు వినియోగదారులకు సౌలభ్యం కూడా పెరగనుంది. ఎందుకంటే, ఆటో డెబిట్‌ జరిగే సమయంలో వినియోగదారు ఫోన్‌కు ఓటీపీ రాకపోవడం, ఆలస్యంగా రావడం లేదా వచ్చినా చూసుకోక పోవడం, ఫోన్‌లో సిగ్నల్‌ లేకపోవడం, స్విచ్ఛాఫ్‌ చేసి ఉన్న సందర్భాల్లో చెల్లింపు పూర్తికాకపోయే ప్రమాదం ఉంటుంది. చెల్లింపు విఫలం లేదా జాప్యం కారణంగా వినియోగదారుల సేవలకు అంతరాయం కలగవచ్చు. క్రెడిట్‌ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లుల విషయంలో పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ఓటీపీ మినహాయింపుతో చిన్న మొత్తాల్లో పునరావృత చెల్లింపులకు ఈ సమస్యలుండవిక.

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 05:20 AM