Share News

రియల్టీ, బంగారంపై తగ్గుతున్న మోజు

ABN , Publish Date - May 22 , 2026 | 05:54 AM

భారతీయ కుటుంబాల పొదుపు పెట్టుబడుల అలవాట్లు మారిపోతున్నాయి. గతంలోలా పొదుపు చేసిన మొత్తాన్ని వారు నగ నట్రా, ఇళ్లు, భూములు కొనుగోలు చేసేందుకు...

రియల్టీ, బంగారంపై తగ్గుతున్న మోజు

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు జై

మారుతున్న భారత కుటుంబాల పొదుపు అలవాట్లు 8సెబీ పరిశోధనా పత్రం వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయ కుటుంబాల పొదుపు పెట్టుబడుల అలవాట్లు మారిపోతున్నాయి. గతంలోలా పొదుపు చేసిన మొత్తాన్ని వారు నగ నట్రా, ఇళ్లు, భూములు కొనుగోలు చేసేందుకు లేదా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నష్ట భయం (రిస్క్‌) ఉన్నా ఏదో ఒక రూపంలో స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు అనేక కుటుంబాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో 2025 మార్చి నాటికి భారతీయ కుటుంబాల స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల ఆస్తుల విలువ రూ.141.34 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రూ.6.91 లక్షల కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో సమకూరాయి. గతంలో ఎన్నడూ ఒక ఆర్థిక సంవత్సరంలో దేశీయ కుటుంబాలు సెక్యూరిటీస్‌ మార్కెట్లో ఇంత పెద్దమొత్తంలో మదుపు చేయలేదు. ప్రభాస్‌ కుమార్‌ రథ్‌, షైనీ సునీల్‌, హెచ్‌ కల్యాణి అనే సెబీ అధికారులు రూపొందించిన ఒక పరిశోఽధనా పత్రం ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం కుటుంబాల పొదుపు పెట్టుబడుల్లో షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈటీఎ్‌ఫలు, రీట్స్‌, ఇన్విట్స్‌, ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొడక్ట్‌ల వంటి ఫైనాన్షియల్‌ ఆస్తుల వాటా 33 శాతం వరకు ఉందని ఆ పత్రం పేర్కొంది.

‘ఎంఎఫ్’లదే హవా

దేశీయ కుటుంబాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) అగ్రస్థానంలో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ కుటుంబాలు సెక్యూరిటీస్‌ మార్కెట్లో రూ.6.91 లక్షల కోట్లు మదుపు చేశాయి. ఇందులో ఐదింట నాలుగు వంతుల (రూ.5.13 లక్షల కోట్లు) మొత్తం ఎంఎ్‌ఫల కొత్త పథకాల (ఎన్‌ఎ్‌ఫఓ) ద్వారా వచ్చినట్టు సెబీ అధికారుల పరిశోధనా పత్రం పేర్కొంది. ప్రస్తుతం అనేక దేశీయ కుటుంబాలు ఎంఎ్‌ఫల ‘క్రమానుగత పెట్టుబడుల (సిప్‌)’ను తమ నెలవారీ పొదుపునకు ప్రధాన సాధనంగా చేసుకున్నట్టు ఆ పత్రం వెల్లడించింది. దీంతో ప్రస్తుతం సిప్‌ల ద్వారానే ఎంఎ్‌ఫలు ప్రతి నెలా సగటున రూ.31,000 కోట్ల వరకు సమీకరిస్తున్నాయి. ఒక్కో కుటుంబం సిప్‌ ద్వారా ప్రతి నెల పొదుపు చేసే మొత్తమూ రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ఉంది.

రూ.141 లక్షల కోట్ల ఆస్తులు

పొదుపు పెట్టుబడుల అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు సెక్యూరిటీస్‌ మార్కెట్‌కు బాగానే కలిసి వస్తోంది. ఈ మార్పుతో 2025 మార్చి నాటికి దేశీయ కుటుంబాలకు షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈక్విటీ, రుణ పత్రాల పథకాలు, రీట్స్‌, ఇన్విట్స్‌లో ఉన్న ఆస్తుల విలువ రూ.141.3 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ఈక్విటీల విలువే రూ.88.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని సెబీ అధికారుల పరిశోధనా పత్రం పేర్కొంది. ఎంఎ్‌ఫల్లోని పెట్టుబడి ఆస్తుల విలువ రూ.44.4 లక్షల కోట్ల వరకు ఉంది.


రియల్టీ, గోల్డ్‌ పెట్టుబడులదే హవా

ఫైనాన్షియల్‌ అసెట్స్‌లో పెట్టుబడులు ఎంత వేగంగా పెరుగుతున్నా, దేశీయ కుటుంబాల పొదుపు పెట్టుబడుల్లో ఇప్పటికీ రియల్టీ, పసిడిదే హవా. కుటుంబాల మొత్తం పొదుపు పెట్టుబడుల్లో రియల్టీ వాటా 51 నుంచి 77 శాతం వరకు ఉంది. ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వాటా 27 నుంచి 33 శాతం వరకు ఉంటుందని సెబీ అధికారుల పరిశోధనా పత్రం పేర్కొంది. పసిడిలోనూ కుటుంబ పొదుపు పెట్టుబడులు 11 నుంచి 15 శాతం వరకు ఉంటాయని అంచనా. రియల్టీ, పసిడిలో కుటుంబ పొదుపు పెట్టుబడుల విలువ ప్రస్తుతం ఎంత లేదన్నా రూ.950 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 05:55 AM