మళ్లీ చమురు భయాలు
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:24 AM
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన యుద్ధం మార్కెట్ని భయపెడుతోంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ 90 డాలర్లు దాటింది. ఈ యుద్ధానికి తెరపడి, కీలకమైన...
ఇప్పటికే 90 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్
హోర్ముజ్లో అవాంతరాలు కొనసాగితే
డిసెంబరు నాటికి 120 డాలర్లకు ధర
హెచ్చరించిన గోల్డ్మన్ శాక్స్
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన యుద్ధం మార్కెట్ని భయపెడుతోంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ 90 డాలర్లు దాటింది. ఈ యుద్ధానికి తెరపడి, కీలకమైన హోర్ముజ్ జలసంధి తెరుచుకోకపోతే ఈ ఏడాది చివరి నాటికి బ్రెంట్ ముడి చమురు పీపా ధర 120 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని ప్రముఖ అంతర్జాతీయ ఇన్వె్స్టమెంట్ బ్యాంకు గోల్డ్మన్ శాక్స్ హెచ్చరించింది. అయితే పరిస్థితి అంతవరకూ పోతుందని తాము అనుకోవడం లేదని తెలిపింది. తీవ్రతరమవుతున్న ఈ యుద్ధంతో పశ్చిమాసియా నుంచి చమురు ఎగుమతులకు బ్రేక్ పడి, ధరలు కొండెక్కడాన్ని గోల్డ్మన్ శాక్స్ అనలిస్ట్ డాన్ స్ట్రువ్యీన్ గుర్తు చేశారు. అయితే ఈ ఉద్రిక్తతలు ఎలా ఉన్నా, పీపా ముడి చమురు ధర ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో 80 డాలర్లు, వచ్చే ఏడాది 75 డాలర్ల వద్ద ట్రేడయ్యే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది.
భారత్కు కష్టమే : ఈ తాజా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థకీ ఎసరు పెట్టనుంది. మన దేశం దిగుమతి చేసుకునే చమురులో 40 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తోంది. క్రూడ్ ధర ఒక డాలర్ పెరిగినా, మన చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల వరకు పెరుగుతుందని దేశీయ బ్రోకరేజీ సంస్థ జేఎం ఫైనాన్షియల్ అంచనా. హోర్ముజ్ జలసంధి మూసివేతతోపాటు ఎర్ర సముద్రం మీదగా జరిగే సౌదీ అరేబియా ముడిచమురు ఎగుమతులను కూడా అడ్డుకుంటామని హౌతీలు ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోందని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ముడిచమురు ధరలు పెరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలూ పెరుగుతాయి. దాంతో రవాణా వ్యయం మరింత భారంగా మారి మార్కెట్లో వస్తు, సేవలు మరింత ప్రియమవుతాయి. తత్ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత ఎగబాకడంతోపాటు వినియోగమూ తగ్గే ప్రమాదం ఉంది. మొత్తంగా ఇది దేశ ఆర్థిక ప్రగతిని కుంగదీయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!