ఏఐతో డేటా సెంటర్లకు డిమాండ్
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:40 AM
దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరగడం, హైపర్స్కేల్ క్లౌడ్ పెట్టుబడులు, దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ నేపథ్యం లో 2025లో 2.2 గిగావాట్లు (జీడబ్ల్యూ) ఉన్న...
భవిష్యత్ పెట్టుబడులు తెలంగాణ, ఏపీలోకి..
2030 నాటికి భారత్ డేటా సెంటర్ల సామర్థ్యం 12 గిగావాట్లు
వుడ్ మెకెంజీ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరగడం, హైపర్స్కేల్ క్లౌడ్ పెట్టుబడులు, దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ నేపథ్యం లో 2025లో 2.2 గిగావాట్లు (జీడబ్ల్యూ) ఉన్న ఆపరేషనల్ డేటా సెంటర్ల సామ ర్థ్యం 2030 నాటికి ఐదింతలకు పైగా పెరిగి 12 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని వుడ్ మెకెంజీ నివేదిక పేర్కొంది. ఏఐ కోసం కేటాయించిన డేటా సెంటర్ సామర్థ్యం 2025లో 275 మెగావాట్లు ఉండగా.. 2030 నాటికి 6,546 మెగావాట్లకు పెరగనుందని తెలిపింది. అలాగే 2025లో 10 టెరావాట్ అవర్స్ (టీడబ్ల్యూహెచ్)గా ఉన్న డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ 2040 నాటికి 191 టీడబ్ల్యూహెచ్కు పెరగనున్నట్టు పేర్కొంది. భారత దేశ డేటా సెంటర్ మార్కెట్ పెట్టుబడులకు కీలకంగా మారిందని వుడ్ మెకెంజీ రిసెర్చ్ అసోసియేట్ సౌహాద్య పాల్ పేర్కొన్నారు. హైపర్ స్కేల్ పెట్టుబడులు, ఏఐ వర్క్లోడ్ పెరగటం, దశాబ్దకాలంగా విధానపరమైన మద్దతుతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఏ మార్కెట్తోనైనా పోటీపడే స్థాయికి భారత్ చేరుకుందన్నారు.
కాగా నివేదిక ప్రకారం.. 2025లో రూ.32 లక్షల కోట్లుగా ఉన్న భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ.. దేశ జీడీపీలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలో 103 కోట్లకు పైగా యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులుండగా.. ప్రతి నెలా సుమారు 2,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇవి డేటా సెంటర్ మౌలిక సదుపాయాల డిమాండ్ పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
ఇక దేశీయ ఏఐ మార్కెట్ 2032 నాటికి రూ.11.7 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం డేటా సెంటర్ల సామర్థ్యంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల వాటా దాదాపు 65 శాతం ఉందని వుడ్ మెకెంజీ పేర్కొంది. భవిష్యత్తులో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ వంటి గ్లోబల్ హైపర్స్కేలర్లతో పాటు అదానీ కనెక్స్ వంటి దేశీయ సంస్థల నుంచి ఈ రాష్ట్రాలు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. వుడ్ మెకెంజీ ప్రకారం.. డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ 2025లో 10టీడబ్ల్యూహెచ్ ఉండగా.. 2040 నాటికి 20 రెట్లకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు 7ు ఉండనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News