‘ఏబీఎన్’ కార్యాలయంపై వైసీపీ దాడి హేయం!
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:51 AM
ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజలు అధికారాన్ని ఊడబీకి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా దౌర్జన్యాలకు....
వారి ఆటవిక ప్రవృత్తికి నిదర్శనం
రాజధాని రైతులు, మహిళల ఆగ్రహం
గుంటూరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజలు అధికారాన్ని ఊడబీకి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా దౌర్జన్యాలకు దిగడం ఆ పార్టీ నేర స్వభావాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. అమరావతిపై విషం చిమ్ముతూ జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? కడుపు మండి విమర్శిస్తే, సమాధానం చెప్పుకోలేక దాడులకు పాల్పడతారా? అంటూ నిలదీశారు. అమరావతిపైన కక్షతోనే మావిగన్ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆది నుంచి తమకు, ఉద్యమానికి బాసటగా నిలిచారని, ఆయన మద్ధతును ఎప్పటికీ మరువలేమని చెప్పారు. మావిగన్పై ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని, రైతుల గుండెల్లో రేగుతున్న మంటలకు ఆయన అక్షర రూపమిచ్చారని చెప్పారు. వారి ఆవేదనను వ్యక్తపరిచిన వేమూరి రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆటవిక ప్రవృత్తి ఏమాత్రం సమర్థనీయం కాదని రాజధాని రైతులు స్పష్టం చేశారు.

దౌర్జన్యాలతోనే వైసీపీ పతనం
దౌర్జన్యాలతో, దాడులతో నెగ్గుకురావాలని వైసీపీ అనుకుంటోంది. కానీ అవే దౌర్జన్యాలు వారిని పతనం వైపు నెడతాయి. అధికారంలో ఉన్నప్పుడు మాపై దౌర్జన్యాలు చేశారు. మహిళలని కూడా చూడకుండా, మగ పోలీసులతో, బూటుకాళ్లతో తన్నించారు. అదే జగన్ను ఇంటికి పంపింది. ఇంకా మారకపోతే ఆయన ఇంకా ఎక్కడికి వెళతారో చెప్పలేం.
- కె. అరుంధతి, తుళ్లూరు

ఇలాంటి పార్టీని ఎప్పుడూ చూడలేదు
నా జీవితంలో ఇలాంటి దుర్మార్గపు పార్టీని ఎప్పుడూ చూడలేదు. రాజకీయ పార్టీలు ఇలా కూడా ఉం టా యా అనిపిస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే దాడి చేయడమేనా? అధికారంలో ఉన్నా.. ఊడినా అదే పనా? ఇది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? ఇలాంటి ఆటవిక ప్రవృత్తిని ఏ ఒక్కరూ అంగీకరించకూడదు.
- పెద్దినేని వెంకటేశ్వరరావు, ఐనవోలు

వినాశకాలే.. విపరీత బుద్ధి
వినాశకాలే.. విపరీత బుద్ధి అంటారు. సాక్షాత్తూ.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవ సన్నిధి దగ్గర ఉండి మాట్లాడుతున్నా. ఈ పోకడలే జగన్ను పదవికి దూరం చేశాయి. ముందు ముందు రాజకీయాలకు కూడా దూరం చేస్తాయి. ఇది శాపం కాదు.. ఆయన చేసిన కర్మలకు ఫలం!
- కొల్లిమర్ల సుబ్బారావు, వెంకటపాలెం

దాడులతో నోరు నొక్కేయగలరా?
పేపర్ ఆఫీసులు, టీవీ చానళ్ల మీద దాడులు చేసి నోరు నొక్కేయగలమని అనుకుంటున్నారా? అలా అనుకోవడంలోనే వైసీపీ చేతగానితనం అర్థమవుతోంది. మావిగన్ను రాజకీయంగా సమర్థించుకోలేకే ఇలా దాడులు చేస్తున్నారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం.
- కారుమంచి జనార్దనరావు, వెలగపూడి

అమరావతిపై అంత కక్ష ఎందుకో..
‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. అవి మా రైతుల మనసుల్లో మెదులుతున్న మాటలు. అమరావతిపై జగన్కు అంత కక్ష ఎందుకో తెలియడం లేదు. మొన్న మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఇదంతా కక్షతోనే చేస్తున్నారు.
- గోవిందమ్మ, తుళ్లూరు