జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:22 PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నాయకులు కులాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఎమ్మెల్యే కామినేని ఆరోపించారు.
ఏలూరు, ఫిబ్రవరి 8: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించిన వ్యవహారంపై ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే(బీజేపీ) కామినేని శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ (ఆదివారం) ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన కామినేని, గత ప్రభుత్వ(వైసీపీ) తీరుపై మండిపడ్డారు.
కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి
కల్తీ నెయ్యి వ్యవహారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కామినేని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ప్రసాదం విషయంలో ఇంతటి అపచారం జరగడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్..
లడ్డూ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నాయకులు కులాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని కామినేని ఆరోపించారు. 'తప్పు చేశారు కాబట్టే, దాని నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లడ్డూ ఇష్యూను పక్కదారి పట్టించేందుకే (కమ్మ-కాపు కులాల ప్రస్తావన తెస్తున్నారు' అని ఆయన విమర్శించారు.
వైసీపీకి భవిష్యత్తు లేదు
గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఆ పార్టీకి ఆ 11 సీట్లూ రావని కామినేని జోస్యం చెప్పారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, ప్రజలు వైసీపీ వైఖరిని గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..
దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..