Share News

చేతబడి నెపంతో యువకుడి హత్య.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Jun 02 , 2026 | 08:47 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో చేతబడి అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. మృతదేహాన్ని శ్మశానంలో దహనం చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు, కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు.

చేతబడి నెపంతో యువకుడి హత్య.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
Parvathipuram Manyam Murder Case

పార్వతీపురం మన్యం జిల్లా: మూఢనమ్మకాల కారణంగా చోటుచేసుకున్న దారుణ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేష్ (30) అనే యువకుడిని చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో కొందరు గ్రామస్తులు దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.


హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని శ్మశానంలో దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దహన కార్యక్రమాన్ని అడ్డుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి సోదరుడు శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNS చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


దర్యాప్తులో భాగంగా హెచ్. కారాడవలస జంక్షన్ వద్ద పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న 16 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. మూఢనమ్మకాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర నేరమని ఆమె హెచ్చరించారు.


Also Read:

మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు

తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట

Updated Date - Jun 02 , 2026 | 08:47 PM