సెప్టెంబర్ 9 తెలుగుజాతి చరిత్రలో చీకటి రోజు: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:12 PM
సెప్టెంబర్ 9ను తెలుగుజాతి చరిత్రలో చీకటి రోజుగా మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్ట్ చేసి జైలుకు పంపారని, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. అయితే చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేకపోయారని అన్నారు.
అమరావతి: సెప్టెంబర్ 9 తెలుగుజాతి చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని చీకటి రోజని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మూడేళ్ల క్రితం అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన విమర్శించారు. రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబుపై పన్నిన కుట్రలే చివరకు వైసీపీ పతనానికి నాంది పలికాయని పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపినా, ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని మాత్రం ఎవరూ జైలులో పెట్టలేకపోయారని అన్నారు. ఆ కష్టకాలంలో చంద్రబాబుకు అండగా యావత్ తెలుగుజాతితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు నిలిచారని మంత్రి గుర్తుచేశారు.
ఎన్ని రాజకీయ కక్షలు, నిర్బంధాలు ఎదురైనా చంద్రబాబు ప్రజల పక్షాన నిలిచి పోరాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు చేసిన సేవలు, ఎదుర్కొన్న పోరాటాలు, ప్రజల కోసం అందించిన కృషి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రజల విశ్వాసమే చంద్రబాబు బలమని, ఆ విశ్వాసంతోనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఎండైనా వానైనా.. హైదరాబాద్ హైరానా
చంద్రబాబు అరెస్ట్కు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ అంటూ లోకేశ్ పోస్ట్
Read Latest AP News And Telugu News