యూట్యూబర్ జోసఫ్ రావణ్పై రాజద్రోహం కేసు.. UAPA కింద కేసు నమోదు
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:15 AM
కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై యూట్యూబర్ రావణ్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కృష్ణా, జులై 5: దేశ సార్వభౌమాధికారానికి, సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై యూట్యూబర్ రావణ్పై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ ముఖ్య నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్ (FIR) దాఖలు చేశారు. సమాజంలో ద్వేషాన్ని పెంచి పోషించడం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి తీవ్రమైన అంశాలను ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. రావణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అతని చట్టవిరుద్ధ కార్యకలాపాలు.. దేశ రక్షణకు, అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
కేవలం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి తీవ్రమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి అతను ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. దేశద్రోహ పూరిత చర్యలను ప్రోత్సహించడం, చట్ట వ్యతిరేక శక్తులకు మద్దతుగా నిలవడం వంటి అంశాలపై ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాతే పోలీసులు కేసు నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో రావణ్పై చట్టపరంగా కఠినమైన సెక్షన్లను ప్రయోగించారు. రావణ్పై U/s 147, 148, 152, 192, 197(1)(d), 353(1)(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటితో పాటు అత్యంత కీలకమైన, దేశ రక్షణకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) లోని సెక్షన్ 13, సెక్షన్ 39లను కూడా ఇందులో చేర్చి, దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్
చిన్నారులకు ప్రాణం పోస్తున్న సత్యసాయి ఆస్పత్రి.. విజయ్, హరీశ్ ప్రశంసలు
Read Latest Telangana News And Telugu News