రాజ్యసభకు ఎంపిక ఉపాధ్యాయ వృత్తికి దక్కిన గౌరవం: భాష్యం రామకృష్ణ
ABN , Publish Date - Jul 26 , 2026 | 01:34 PM
రాజ్యసభకు తన ఎంపిక ఉపాధ్యాయ వృత్తికి దక్కిన గౌరవమని ఎంపీ భాష్యం రామకృష్ణ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
అమరావతి, జులై 26: రాజ్యసభకు తన ఎంపిక ఉపాధ్యాయ వృత్తికి దక్కిన గౌరవమని ఎంపీ భాష్యం రామకృష్ణ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి దక్కిన అత్యున్నత గుర్తింపుగా భావిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ సాధన చారిత్రాత్మక విజయమని ఆయన అన్నారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా సీనియర్ టీచర్ల టెట్ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని.. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ఇందుకు నిదర్శనమని భాష్యం రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులే నాణ్యమైన విద్యకు బలమైన ఆధారమని పేర్కొంటూ.. డీఎస్సీ అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఉత్తమ విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి లోకేశ్ పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రతి ఉపాధ్యాయుడూ కృషి చేయాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి రిజైన్ చేస్తే సరిపోదు.. మళ్లీ జరగకుండా సంస్కరణలు తేవాలి: కవిత
జరిమానాలతోనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట