Share News

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు: ఎంపీ పురందేశ్వరి

ABN , Publish Date - Apr 16 , 2026 | 08:20 PM

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ పురందేశ్వరి చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, పునర్విభజన బిల్లులను ఆమె స్వాగతించారు.

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు: ఎంపీ పురందేశ్వరి
Purandeswari Supports Delimitation Bill

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: లోక్‌సభలో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill 2026), 131వ రాజ్యాంగ సవరణ బిల్లులపై జరిగిన చర్చలో రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు. ఈ చారిత్రక బిల్లులకు పూర్తి మద్దతు ప్రకటించిన ఆమె, మహిళా రిజర్వేషన్ల అమలులో గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు.

ఎన్టీఆర్ వారసత్వాన్ని స్మరిస్తూ..

ప్రసంగం ప్రారంభంలో ఆమె తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) మహిళా సాధికారత కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, మహిళా విశ్వవిద్యాలయం, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక నిర్ణయాలను ఆయన తీసుకున్నారని సభకు వివరించారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై స్పష్టత

నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోతాయన్న ఆందోళనలపై ఆమె స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం, లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికి ఉన్న ప్రస్తుత సీట్లు తగ్గవని భరోసా ఇచ్చారు.


2011 జనాభా లెక్కల ప్రకారం సీట్ల పెంపు ఉండటం వల్ల రాజకీయ సమతుల్యత దెబ్బతినదని, దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంట్‌లో బలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో తీవ్ర జాప్యం చేసిందని పురందేశ్వరి విమర్శించారు.

1996 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును 2010లో రాజ్యసభ ఆమోదించినా, లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్‌కు మనసు రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఈ బిల్లును యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తుంటే, విపక్షాలు అనవసరపు రాజకీయ కారణాలతో అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు.

మహిళా సాధికారతకు నిదర్శనం

మహిళా రిజర్వేషన్ల అమలు వల్ల దేశాభివృద్ధిలో మహిళలు కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా, నిర్ణేతలుగా (Decision Makers) మారతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ బిల్లు మహిళలకు రాజకీయ న్యాయం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పునర్విభజన ప్రక్రియలో ప్రతి రాష్ట్రం గొంతు వినబడుతుందని, పబ్లిక్ హియరింగ్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని చెబుతూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.


ఇవీ చదవండి:

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి

Updated Date - Apr 16 , 2026 | 08:41 PM