పోలవరం నిర్వాసితులకు భారీ ఊరట
ABN , Publish Date - May 07 , 2026 | 04:22 AM
రాష్ట్ర జీవన రేఖ పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చి నిర్వాసితులైన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.3.57 లక్షలకు పెంపు
భూమి కొనుగోలుకు రూ.2 లక్షల సాయం
ఓటీఎస్ కింద ఇక రూ.6.85 లక్షలు చెల్లింపు
సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవన రేఖ పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చి నిర్వాసితులైన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సహాయ పునరావాస కాలనీల్లో ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్నవారికి ఒక్కో గృహానికి ఇంతవరకు రూ.2.85 లక్షలు చెల్లిస్తున్నారు. ఇటీవల ఈ ధరను ఆర్ అండ్ ఆర్ కమిటీ పరిశీలించి నిర్మాణ వ్యయాన్ని రూ.3.57 లక్షలకు పెంచాలని నిర్ణయుంచింది. ఇందుకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదం తెలుపడంతో ఈ మొత్తాన్ని సొంతంగా ఇల్లు కట్టుకుంటున్న నిర్వాసితులకు చెల్లించాలని ఆదేశిస్తూ జలవనరుల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎస్ సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఇప్పుడు వారికి భూమి కొనుగోలుకు రూ.లక్ష చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా రెట్టింపు చేస్తూ రెండు లక్షలు ఇవ్వాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వాసిత కుటుంబాలకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద రూ.3.85 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తం చాలదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేసినవారికి మరింత సహకారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో ఓటీఎస్ కింద చెల్లింపును రూ.6.85 లక్షలకు పెంచేందుకు గత క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రాంతాన్ని ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిర్వాసితులు సంతోషంగా సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని పోలవరం సహాయ, పునరావాస కమిషనర్ ప్రశాంతి ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. పునరావాస కార్యక్రమాలకు మరో రూ.300 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు.