ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని.. తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్..
ABN , Publish Date - Mar 28 , 2026 | 03:53 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అమరావతి, మార్చి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం పవన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. తెలంగాణ వేరు.. ఏపీ వేరు అనే భావన మాకెప్పుడూ లేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదు. రాజధాని లేని రాష్ట్రంగా మనం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. ఏపీ నేలపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా టీడీపీతో కలిశాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కూటమిగా ఏర్పడ్డాం. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా అరాచకమే. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే మహిళలు భయపడేవారు. ప్రశ్నించిన అందరిపైనా దాడులు చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
జగన్ మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపం.. పయ్యావుల ఫైర్
అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు